ఏపీలో స్కూల్ టీచర్ క్లాస్లో సెల్ ఫోన్ వాడితే అంతే.. ప్రిన్సిపల్పై కూడా వేటు తప్పదు..!!
అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ నడుచుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని చెప్పి మరీ పాఠిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తరగతి గదిలో టీచర్ వద్ద ఫోన్ ఉండొద్దని నిర్ణయం తీసుకున్నారు. దీనిని తూ.చా తప్పకుండా పాటిస్తామని స్పష్టంచేశారు. ఒకవేళ టీచర్ వద్ద మొబైల్ ఉంటే .. ఆ స్కూల్ హెడ్మాస్టర్పై కూడా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు.
చదవడం, రాయడం రావట్లేడు
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు కూడా సరిగా రాయడం, చదవడం రావడం లేదు దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రభుత్వం స్కూళ్లలో మరింత కఠినచర్యలు తీసుకుంటున్నారు. పిల్లల్లో ఏకాగ్రత పెంచేందుకు తరగతి గదిలో టీచర్ మొబైల్ వాడొద్దని ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా కరువు జిల్లా అనంతపురంపై అధికారులు ఫోకస్ చేశారు. కరువుతో అక్కడి రైతులు ప్రైవేట్ స్కూల్కు విద్యార్థులను పంపే పరిస్థితి లేదు. జిల్లాలో ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అనంతపురం డీఈవో శామ్యూల్ తెలిపారు.
13 వేల మంది చేరారు
ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 13 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చారని పేర్కొన్నారు. మరికొంత మంది వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాలలో ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆయా పాఠశాలల్లో టీచర్లు విధింగా రిజిష్టర్లు నిర్వహించాలని తేల్చిచెప్పారు. డైరీ రాయాలని, లెసన్ ప్లాన్ కూడా ఉండాలని నిర్దేశం చేశారు
బయోమెట్రిక్ తప్పనిసరి
ఆయా పాఠశాలల్లో బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారాయన. జిల్లాలో 18 వేల మంది టీచర్లు ఉన్నారని పేర్కొన్నారు. కానీ 10 శాతం మాత్రం బయోమెట్రిక్ అటెండెన్స్ అని .. మిగతావారు వేయడం లేదని తెలిపారు. సాంకేతికపరమైన ఇబ్బందులుంటే పరిష్కరించుకుందామని చెప్పారు. స్కూల్ పనివేళల్లో ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉండాలని తేల్చిచెప్పారు. ఈ విషయంలో టీచర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులైనా ఒక్కటేనని తేల్చిచెప్పారు. నిబంధనలను వ్యతిరేకిస్తే ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. పనివేళల్లో డీఈవోను కలిసేందుకు ఉపాధ్యాయులు రావొద్దని సూచించారు. వారంలో మూడురోజులు సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు.