అక్రమ సంబంధానికి బలైన పసికందు, తల్లి పరిస్థితి విషమం
ఆలూరు : అక్రమ సంబంధం ఓ చిన్నారిని అమ్మ కడుపులోనే చిదిమేసింది. మాయ మాటలు చెప్పి మహిళను గర్బవతిని చేసిన ఓ ప్రబుద్దుడు.. ఆమెకు అబార్షన్ చేయించడానికి యత్నించడంతో పసిగుడ్డు కాస్త కడుపులోనే కన్ను మూసింది. కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అరికెర గ్రామానికి చెందిన బోయ లక్ష్మి అనే మహిళకు, హాలహర్వి మండలం విరుపాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో కొన్నాళ్లుగా పుట్టినింటిలోనే ఉంటోంది బోయ లక్ష్మి.

ఇదే క్రమంలో అరికెర గ్రామానికే చెందిన మరో వ్యక్తితో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారడంతో.. పెళ్లి చేసుకుంటానని చెప్పి లక్ష్మిని లొంగదీసుకున్నాడు సదరు వ్యక్తి . దీంతో గర్బం దాల్చిన లక్ష్మి, ఎనిమిది నెలలు నిండడంతో విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని భావించి తనతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి వద్దకు వెళ్లింది.
కాగా, నెలలు నిండిన విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి, అబార్షన్ కోసం ఆమెను ఓ ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యుడు ఓ మాత్ర ఇవ్వడంతో.. నొప్పులతో బాధపడ్డ మహిళ మృత శిశువుకు జన్మనిచ్చింది. అయితే శిశువు చనిపోవడంతో ఆవేదన చెందిన లక్ష్మి స్థానిక పోలీస్ స్టేషన్ లో తనను మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం లక్ష్మి ఆరోగ్య పరిస్థితి కూడా బాగా లేకపోవడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఎస్.ఐ ధనుంజయతో పాటు మరికొందరు పోలీసులు పసికందు మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications