గోవా ట్రేడ్: నకిలీ మద్యమంతా అక్కడి నుంచే..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి కల్తీ మద్యం గోవాలోని అనధికారిక డిస్టిల్లరీల నుంచి ప్రవహిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని బ్రాండ్ల కల్తీ మద్యం కూడా అక్కడి నుంచే ఇరు రాష్ట్రాలకు చేరుతున్నట్లు అనుమానిస్తున్నారు. డిఫెన్స్ సప్లయ్ మార్కు మద్యం కూడా గోవా నుంచి సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు జిల్లాల నాయకుల సహకారంతో ఆ కల్తీ మద్యం వ్యాపారం సాగుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గత డిసెంబర్లో గోగా ట్రేడ్కు సంబంధించి కర్నూలు జిల్లా స్థాయి ప్రతినిధి, ఎంపిటిసీ సభ్యులు ఆరోపణలు ఎదుర్కున్నారు.
కాగా, అనంతపురం ఆబ్కారీ పోలీసులు 800 బాక్సుల మద్యాన్ని రవాణా చేస్తున్న ఓ ముఠాను కొద్ది నెలల క్రితం పట్టుకున్నారు. తప్పుడు ఇన్ వాయిస్లతో నూడుల్ ప్యాకెట్లు, పొటాటో చిప్స్ చాటు దాచిన హేవార్డ్స్, బాగ్పైపర్ మద్యం సీసాలను రవాణా చేస్తుండడాన్ని గుర్తించి, వాటిని పట్టుకున్నారు.
పోలీసులు గోవాలోని అనధికారిక డిస్టిల్లరీపై దాడి చేసి, ఓ గోడౌన్ను స్వాధీనం చేసుకుని, కర్ణాటకకు చెందిన కింగ్పిన్ రామయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ బాటిల్స్ అచ్చం ఒరిజినల్ బాటిల్స్ మాదిరిగానే కనిపిస్తాయి. ఎపి, తెలంగాణల్లోని లైసెన్స్ ఉన్న బ్రీవరీలు, బాటిలింగ్ యూనిట్లలో, డిఫెన్స్ రంగంలోని యూనిటల్లో తయారయ్యే వాటి మాదిరిగానే ఏ మాత్రం అనుమానం రాకుండా ఉంటాయి.