Michaung Cyclone: ముంచుకొస్తున్న తుఫాను, భారీ వర్షాలు - 144 రైళ్లు రద్దు..!!
ఏపీలోని పలు జిల్లాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది. మిచౌంగ్ తుఫాను ఈ నెల ఐదో తేదీ ఉదయానికి ఒంగోలు-మచిలీపట్నం మధ్య చీరాల లేదా బాపట్లకు సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండానికి అనుకూలంగా తూర్పు, పడమర గాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా 144 రైళ్లను రద్దు చేసారు.
తుఫాను ప్రభావం
తీవ్ర వాయుగుండం బలపడి ఆదివారం నాటికి తుఫాన్గా మారి దక్షిణ కోస్తాలో తీరం దాటిన తరువాత కోస్తా మీదుగా పయనించనున్నది. ఈ క్రమంలో ఐదో తేదీ రాత్రి వరకు తుఫాన్గా కొనసాగుతుంది. తరువాత తీవ్ర వాయుగుండంగా స్వల్పంగా బలహీనపడి ఉత్తర కోస్తా మీదుగా ఒడిశాలో ప్రవేశిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఆదివారం రాత్రి నుంచి ఆరో తేదీ వరకు కోస్తాపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

తీవ్ర వాయుగుండం ప్రభావంతో శనివారం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. బాపట్ల, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, కడప, నంద్యాల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి.
అతి భారీ వర్షాలు
నాలుగో తేదీన కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీవర్షాలు కురుస్తాయి. ఇంకా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయి. తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
ఐదో తేదీన కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, కడప, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి.
144 రైళ్లను రద్దు చేసిన రైల్వే
మిచౌంగ్ తుఫాన్ కారణంగా రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు భారీగా రద్దయ్యాయి. విజయవాడ మీదుగా గ్రాండ్ మెయిన్ ట్రంక్ లైన్ మీద రాకపోకలు సాగించే రైళ్లను భారీ సంఖ్యలో రైల్వే శాఖ రద్దు చేసింది. శనివారం రాత్రి 7 గంటల సమయానికి మొత్తం 144 రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఇందులో విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్లను కూడా రద్దు చేశారు.
అవిజయవాడ నుంచి న్యూఢిల్లీ వెళ్లే దురంతో సూపర్ఫాస్ట్ కూడా రద్దయ్యింది. విజయవాడ-చెన్నై వెళ్లే పినాకిని రద్దయ్యింది. విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్, విజయవాడ-గూడూరు, నర్సాపూర్-కొట్టాయం, కాకినాడ టౌన్-తిరుపతితోపాటు సికింద్రాబాద్-విజయవాడ, లింగంపల్లి-విజయవాడ మధ్యన నడిచే అనేక రైళ్లను రద్దు చేశారు. సికింద్రాబాద్ - విశాఖ, విజయవాడ-బెంగళూరు మధ్యన నడిచే రైళ్లు కూడా రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications