రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండండి..!!
తెలుగు రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రవేశం తరువాత గమనం మందగిచింది. ఇప్పుడు వేగంగా విస్తరిస్తుండటంతో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీ, తెలంగాణలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఏపీలో పలు ప్రాంతాల్లో ఉదయం సమయంలో ఉక్కపోత కొనసాగోతంది. కానీ, సాయంత్రం వేళకు కుండపోత కురుస్తోంది. నైరుతి విస్తరిస్తున్న వేళ ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తోడై మరింతగా వర్షాలకు అవకాశం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా రానున్న మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పిడుగులు, ఈదురు గాలులతో వానలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసారు. తెలంగాణలోని వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

ఏపీలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, విజయవాడ, గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వాన దంచి కొట్టింది. దీంతో పలు చోట్ల పంటలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. గత నెల తొలి వారంలోనే రాయలసీమలో ప్రవేశించిన రుతుపవనాలు అనేక రోజుల్లో విస్తరించలేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా స్థిరంగా ఉన్నాయి. బిపర్జాయ్ తుఫాను తరువాత వేగం పెరిగింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తొలకరితో పలు ప్రాంతాల్లో తడిసి ముద్దయ్యాయి. మరో మూడు రోజులు ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి.












Click it and Unblock the Notifications