రుతుపవనాల పై కీలక అప్ డేట్ - మారిన వాతావరణం..!!
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. కొద్ది రోజులుగా రికార్డు ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఏపీతో పాటుగా తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ తమిళనాడు నుండి మరఠ్వాడా, కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది. ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సమయంలో రుతుపవనా ల రాకకు సంబంధించి వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది.
పలు జిల్లాల్లో వర్షాలు:ఏపీలో ఈ రోజు (మంగళవారం) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల శాఖ పేర్కొంది. అనకాపల్లి, అల్లూరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి,అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. అర్ద్రరాత్రి సమయంలో వర్షాలు కురిసాయి. వర్షాల వేళ ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉందని, ఎవరూ చెట్ల కింద ఉండవద్దని హెచ్చరించింది.

ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం:ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతున్నాయి. సాయంత్రం తరువాత ఈదురు గాలులు, వర్షాలతో వాతావరణం పూర్తి భిన్నంగా మారిపోయింది. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలతో ఇప్పటి వరకు ఎండలతో ఇబ్బంది పడిన వారికి ఉపశమనం దొరికింది.
రుతుపవనాలపై అంచనాలు:ప్రతీ ఏటా జూన్ ప్రారంభానికి రుతుపవనాల ప్రవేశం మొదలవుతుంది. ఈ ఏడాది జూన్ 4వ తేదీకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తొలుత జూన్ 7వ తేదీ నాటికి ప్రవేశిస్తాయని అంచనాలు వెల్లడయ్యాయి. మరో వైపు రానున్న 3 రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు నమోదయ్యాయి. ఈ వర్షాల ప్రభావంతో రోహిణీ కార్తె వేళ ఎండ వేడి ప్రభావం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications