బాబుకు భద్రత పెంపు, తెలంగాణకిచ్చేద్దాం కానీ: మెలిక, కేబినెట్ కీలక నిర్ణయాలివే..
అమరావతి: హైదరాబాదులోని ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించాలని చేసిన తీర్మానం పైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో సోమవారం నాడు చర్చ జరిగింది. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆయన కార్యాలయంలో కేబినెట్ భేటీ జరిగింది.
ఈ భేటీలో మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు ప్రయివేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గొర్రెలు, మేకల పెంపకం విధానంపై సుదీర్ఘంగా చర్చించారు. ఖాయిలా పడ్డ జౌళి పరిశ్రమలకు రూ.350 కోట్ల విద్యుత్ రాయితీకి ఆమోదం తెలిపారు.
విశాఖలో 2, శ్రీసిటీ, చిత్తూరులో చెరో ఒకటి చొప్పున ప్రయివేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మధురవాడలో 400 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీయే తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. వుడా స్థానంలో విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుపై చర్చించారు.
670 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మావోయిస్టు హెచ్చరిక లేఖ నేపథ్యంలో చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించాలని నిర్ణయించారు. సచివాలయ భవనాల అప్పగింతపై చర్చ జరిగింది. తీర్మానం పైన చర్చించారు.
అలాగే, సచివాలయ తరలింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని కేబినెట్ అభిప్రాయపడింది. దీని వల్ల ఉత్పన్నమైన సమస్యల్ని పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించాలని నిర్ణయించారు.
ఎజెండాలో పేర్కొన్న అంశాలే కాకుండా రాజకీయ అంశాలపైనా చర్చించారు. జన చైతన్య యాత్ర, టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు.
హైదరాబాదులోని ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించే అంశంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటీని పరిష్కరించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, ఆస్తుల విభజనతో పాటు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కు శాశ్వత ప్రాతిపదికన భవనం కేటాయించే అంశంపై స్పష్టత వచ్చాకే సచివాలయ భవనాలను అప్పగించాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.
తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరితో ఉన్నామన్న భావన ఎవరికీ రావొద్దని, అలాగే ఈ ప్రతిపాదన గవర్నర్ ద్వారా వచ్చింది కాబట్టి ఆయనను నొప్పించేలా నిర్ణయం ఉండరాదని కేబినెట్లో చర్చ జరిగిందని తెలుస్తోంది. తెలంగాణకు అప్పగించే విషయంలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని చర్చించారు.
భవనాలు అప్పగించారన్న భావన వస్తే విపక్షాలు దాడికి దిగే అవకాశముందని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఎప్పటికైనా భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాల్సిందేనని, కాకపోతే దానికి ముందే అపరిష్కృత అంశాలన్నీ పరిష్కరించుకుంటే మంచిదని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో వీటన్నిటిపై అధ్యయనానికి ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, ఎన్.చినరాజప్ప మంత్రులు యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్, అచ్చెన్నాయుడులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.