వెంకయ్య కాళ్ల వద్ద: కిషన్పై పొన్నం, కేసీఆర్ సరిగాలేరని
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పైన, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంకయ్య తెలంగాణకు అన్యాయం చేస్తున్నా బీజేపీ తెలంగాణ నేతలు ఆయన కాళ్ల వద్ద మోకరిల్లుతున్నారన్నారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపర్చిన అంశాల మేరకే గవర్నర్కు అధికారాలను కట్టబెట్టారన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
మాజీ ఎంపీలు వివేక్, రాజయ్యతో కలిసి పొన్నం మంగళవారం గాంధీ భవన్లో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లు పాస్ అయినప్పుడు అందులోని సెక్షన్ 8 క్లాజులు 1, 2, 3లలో గవర్నర్కు శాంతి భద్రతలు ఇవ్వాలన్న అంశాలు లేవని చెప్పారు. కానీ 8వ సెక్షన్ ప్రకారమే గవర్నర్కు అధికారాలు ఇచ్చారని చెప్పడాన్ని బట్టి చూస్తే కిషన్ రెడ్డికి ఆ మాత్రం జ్ఞానం లేదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు కూడా రెచ్చగొట్టేలా ఉంటున్నాయని, ఆయన తీరు సీఎంలా లేదన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు రహస్య ఎజెండాతో హైదరాబాద్ను గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. గవర్నర్కు అధికారాలు కట్టబెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెరాసదేనని వివేక్ అన్నారు. హైదరాబాదును యూటీ చేస్తే తెలంగాణలో బీజేపీ, టీడీపీ గల్లంతవడం ఖాయమన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతల బాధ్యతలు గవర్నర్కు ఇచ్చినా, రాష్ట్రపతి పాలన విధించినా ఒక్కటేనని విహెచ్ ధ్వజమెత్తారు.
పొన్నాల దిష్టిబొమ్మ దగ్ధం
మాజీ మంత్రి ఫరీదుద్దీన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్ మైనార్టీ నేతలు గాంధీభవన్ ఆవరణలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. పొన్నాల లక్ష్మయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే, ఫరీదుద్దీన్ కాంగ్రెస్ ద్రోహి అని, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని మైనారిటీ సెల్ చైర్మన్ సిరాజుద్దీన్, వైస్ చైర్మన్ హాది అలీ అన్నారు.