టిఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే మాటిచ్చాం: టిపై జైరాం
మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావానికి ముందే తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చిందని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. ఆయన బుధవారం మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2000 సెప్టెంబర్ 21న మహబూబ్నగర్లో తెలంగాణ ప్రకటన చేసినట్లు గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. లోకసభలో తెలంగాణ బిల్లుకు బేషరతుగా మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ.. రాజ్యసభలో మాత్రం ద్వంద్వ వైఖరి అవలంభించిందని జైరాం రమేష్ ఆరోపించారు.

ఐదేళ్లలో తెలంగాణలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల్లో పదేళ్ల పాటు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వెనకబడిన జిల్లా అయిన మహబూబ్నగర్కు కూడా పదేళ్లు పన్ను రాయితీ లభిస్తుందని జైరాం చెప్పారు.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు వాటా ఉండదని జైరాం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా లేఖ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తర్వాత మాట మార్చిందని జైరాం రమేష్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications