Mansas trust: సంచైత గజపతిరాజుకు బిగ్ షాక్: ఛైర్మన్గా మళ్లీ అశోక్: హైకోర్టు సంచలనం
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరో షాక్. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చారిత్రాత్మక మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్షిప్ వ్యవహారంలో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ స్థానుం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజును తొలగిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 72ను చెల్లదని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
గులాబీ పోయి కాషాయ కండువా వచ్చె: బీజేపీలో ఈటల, మాజీ డీఎస్పీ నళిని: జేపీ నడ్డా గైర్హాజర్
ఈ తాజా తీర్పు ప్రకారం.. మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా అశోక గజపతి రాజు మళ్లీ బాధ్యతలను స్వీకరించడం లాంఛనప్రాయమే అవుతుంది. ఈ ట్రస్ట్ ఛైర్ పర్సన్గా ప్రస్తుతం గజపతి రాజు కుటుంబానికే చెందిన సంచైత గజపతి రాజు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం పాలక మండలి ఛైర్ పర్సన్గా కూడా ఆమె వ్యవహరిస్తోన్నారు. అశోక్ గజపతి రాజును తొలగిస్తూ, ఆయన స్థానంలో సంచైత గజపతిరాజును నియమిస్తూ ఇదివరకు ప్రభుత్వం జీవో నంబర్ 72ను జారీ చేసింది.
వంశపారంపర్యంగా వస్తోన్న మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ స్థానం నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ అశోక్ గజపతి రాజు హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణలను నిర్వహించిన బెంచ్.. కొద్దిసేపటి కిందటే తన తీర్పును వెలువడించింది. జీవో నంబర్ 72ను కొట్టివేసింది. ఈ విషయంలో సంచైత దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. దాన్ని తోసిపుచ్చింది.
జీవో నంబర్ 72ను జారీ చేయడానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో.. దాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామాలతో అశోక్ గజపతి రాజు మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా బాధ్యతలను స్వీకరించడం లాంఛనప్రాయమే అవుతుంది. ఆలస్యం చేయకుండా ఆయన బాధ్యతలను స్వీకరించే అవకాశాలు లేకపోలేదు. మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ స్థానంతో పాటు సింహాచలం దేవస్థానం పాలక మండలి ట్రస్ట్ ఛైర్మన్గానూ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు.