ప్రధాని మోదీ - చంద్రబాబు : నాలుగేళ్ల తరువాత - ఫేస్ టు ఫేస్..!!
ఏపీ రాజకీయాలకు సంబంధించి ఢిల్లీ కేంద్రంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ఈ రోజు ఢిల్లీలో ఉంటారు. కానీ, ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన పైన ఆసక్తి నెలకొని ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. అధికారిక షెడ్యల్ ప్రకారం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో మధ్యాహ్నం 12.25 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
ప్రధాని సమావేశంలో చంద్రబాబు
రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంకు హాజరు కావాలని కేంద్రం ఆహ్వానించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ కమిటీలో లోక్సభ స్పీకర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు,ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలు, అధికారులు, మీడియా ప్రముఖులు, ఆధ్యాత్మిక నాయకులు, కళాకారులు, సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ,హర్ ఘర్ తిరంగా కేంద్రం చేస్తున్న కార్యక్రమాలతో ఓటు కమిటీ సభ్యుల నుంచి కేంద్రం సలహాలు, సూచనలు తీసుకోనుంది.
నాలుగేళ్ల విరామం తరువాత
అయితే, 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు ప్రధాని మోదీతో సమావేశం కాలేదు. ఆయన సమావేశాల్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఇప్పుడు దాదాపుగా నాలుగేళ్ల విరామం తరువాత ప్రధాని - చంద్రబాబు ఒకరికి ఒకరు ఎదురు పడనున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు మూడు సందర్భాల్లో ప్రధానికి చంద్రబాబు లేఖలు రాసారు.
ఆయన నిర్ణయాలను పలు సందర్భాల్లో అభినందించారు. తాజాగా రాష్ట్రపతి.. ఈ రోజు జరగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ అభ్యర్ధికే టీడీపీ మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికల వేళ..ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు నాడు ప్రధానిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు..తరువాత కాంగ్రెస్ తో జత కట్టటంతో బీజేపీ నేతలతో సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.
సీఎం జగన్ - చంద్రబాబు ఇద్దరూ ఢిల్లీలో
2019 ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాలకు చంద్రబాబు దూరంగా ఉంటున్నారు. ఇక, ఇప్పుడు ఏపీలో జగన్ కు కేంద్రం లోని ముఖ్యుల నుంచి వచ్చే ఎన్నికల నాటికి మద్దతు లేకుండా చేసే ప్రయత్నాలు చంద్రబాబు ప్రారంభించారనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దీంతో..చంద్రబాబు నెమ్మదిగా ఢిల్లీ వైపు పావులు కదుపుతున్నారు. ఇక, ఇప్పుడు ప్రధాని సమావేశంలో చంద్రబాబు పాల్గొనటం ద్వారా.. రాజకీయంగా ఈ సమావేశం పైన ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యమంత్రి జగన్ రేపు ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులు..ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు.