ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాక్ - ఊహించని విధంగా నిర్ణయం..!!
కేంద్రం ఏపీకి షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన నిధులను వెనక్కు తీసుకుంది. కేంద్రం నుంచి ఇటీవల ఏపీకి రూ 982 కోట్లు అందాయి. జీఎస్టీ..ఇతరత్రా రూపాల్లో వచ్చిన ఈ నిధులను కేంద్రం వెనక్కు తీసేసుకుంది. ఆర్దికంగా కష్టాల్లో ఉన్న ఏపీకి ఈ నిర్ణయం ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రతీ నెలా అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ వాటా నిధులను విడుదల చేస్తుంది. అందులో భాగంగా ఏపీకి రూ 682 కోట్లు ఏపీకి రావాల్సి ఉంది. వీటితో పాటుగా మరో రూ 300 కోట్లు రాష్ట్రానికి ఇవ్వనున్నట్లు కేంద్రం నుంచి సమాచారం అందింది. కానీ, ఆ నిధులు ఏపీకి చేరలేదు.
కేంద్ర నిధులు వెనక్కు..
దీని పైన ఏపీ ఆర్దిక శాఖ అధికారులు కేంద్ర అధికారులతో చర్చించారు. నిధులు రాకపోవటం పైన ఆరా తీసారు. ఏపీ నుంచి పాత బకాయిలు రావాల్సి ఉందని...అందులో భాగంగా ఈ నిధులు సర్దుబాటు చేసుకున్నామంటూ కేంద్ర ఆర్దిక శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో, ఏపీ అధికారులకు ప్రస్తుత సమయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమస్యగా మారుతోంది. ఏపీ ప్రభుత్వానికి ప్రతీ నెల తొలి వారం ఆర్దికంగా చాలా కీలకం. ఉద్యోగుల వేతనాలు - పెన్షన్లతో పాటుగా సామాజిక పెన్షన్లను ప్రతీ నెల ఒకటో తేదీనే చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీ నుంచి బకాయిలు రావాలంటూ
దీని కోసం ప్రతీ నెలా చివరి వారం నుంచి అధికారులు సర్దుబాట్లు చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధుల అంచనాతోనూ కలిపి లెక్కలతో సిద్దం అవుతారు. కానీ, ఈ నెల అనూహ్యంగా ఒకేసారి దాదాపుగా వెయ్యి కోట్లకు సంబంధించి సమస్య రావటంతో, ఏపీ అధికారులకు ఇబ్బందిగా మారింది. ప్రతీ రోజు లావాదేవీలు ముగిసిన తరువాత రిజర్వ్ బ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. అందులో భాగంగా ఆ రోజుకు సంబంధించి రాష్ట్ర ఆదాయంతో పాటుగా అప్పులు - చెల్లింపుల వివరాలను అందిస్తుంది కేంద్రం నుంచి ఏ రూపంలో ఎంత మొత్తం వచ్చిందీ.. ఏరకంగా మినహాయింపులు చేసుకుందీ స్టేట్ మెంట్ ద్వారా అందిస్తుంది.
వెయ్యి కోట్ల మేర సర్దుబాటు..!
దీంతో, రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం కేంద్రం నుంచి ఏపీ ఖాతాకు నిధులు జమ అయినట్లు లెక్కల్లో చూపించినా..ఆ మొత్తం వాస్తవంగా జమ కాలేదు. దీనిని అడ్జస్ట్ చేసినట్లుగా తరువాత కేంద్ర అధికారులను ఆరా తీయగా నిర్దారణ అయింది. ప్రస్తుతం తొలి వారంలో ఏపీ ప్రభుత్వం చేయాల్సిన చెల్లింపు లకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సమస్యగా మారింది. దీనిని ఇప్పుడు ఇతర ఆదాయాల ద్వారా ఏపీ ప్రభుత్వం భర్తీ చేసుకోవాల్సి వస్తోంది. ఇదంతా కేంద్రం - రాష్ట్రం మధ్య జరిగే ఆర్దిక లావాదేవీల్లో సహజంగా జరిగే అంశాలేనని అధికారులు చెబుతున్నారు.