మోదీ మార్క్ రాజకీయం - చంద్రబాబు షాక్ : ఒక్క ఫోన్ కాల్ - ఆశలన్నీ ఆడియాసలే..!!
YS Sharmila to meet PM Modi: టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త అంచనాలతో ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఎలాగైనా ప్రధాని మోదీతో ఒన్ టు ఒన్ భేటీ కావాలని భావించారు. 2014 తరహాలోనే ఢిల్లీ కేంద్రంగా పొత్తులకు పావులు కదపాలని వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. కానీ, ప్రయత్నాలు ఫలించలేదు. అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు చెప్పిన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని మోదీ..రాజకీయంగా మాత్రం తన మార్క్ నిర్ణయాలు ఎలా ఉంటాయో మరోసారి నిరూపించారు చంద్రబాబు ఢిల్లీలో ఉండగానే ప్రధాని చేసిన ఒకే ఒక్క ఫోన్ కాల్ తో మొత్తం సీన్ మారిపోయింది.
బీజేపీతో పొత్తు దిశగా టీడీపీ అడుగులు..
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించి అధికారం దక్కించుకోవాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. ఇందు కోసం ఏ అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేరు. అందులో భాగంగానే.. 2014 తరహాలో ఏపీలో పొత్తుల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ - జనసేనతో తిరిగి పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్లాలనేది టీడీపీ వ్యూహం. పవన్ కల్యాణ్ తమతో కలుస్తారనే నమ్మకం ఉన్నా.. రిమోట్ ఢిల్లీలో ఉందనేది టీడీపీ నేతల అంచనా. దీంతో, ప్రధాని మోదీ తో తిరిగి సత్సంబంధాల ద్వారా అటు బీజేపీ..ఇటు జనసేన తో పొత్తు కు స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ఉండదని చెబుతున్నా.. చంద్రబాబు చివరి వరకు తన ప్రయత్నాలు కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారు. నేరుగా తమతో పొత్తు లేకపోయినా.. ఎన్నికల సమయంలో సహజంగా ప్రభావితం చేసే అంశాల్లో జగన్ కు సహకారం లేకుండా చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. అందులో భాగంగా.. బీజేపీ - టీడీపీ మధ్య వర్తుల మధ్య కీలక ప్రతిపాదన తెచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
టీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు సహకారం
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లక్ష్యం తెలంగాణ. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమతోనే ఉంటారనేది బీజేపీ ధీమా. టీఆర్ఎస్ లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో రాజకీయ పోరాటం చేస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవటంలో బీజేపీకి సహకరించేందుకు టీడీపీ సిద్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ నగరంతో పాటుగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉందని..టీడీపీ - బీజేపీ పొత్తు ఖరారైతే ఆ ప్రాంతాల్లో గణనీయంగా ఓట్లు - సీట్లు వస్తాయని చెబుతున్నారు. తెలంగాణలో తాము బీజేపీకి సహకరించటం.. ఏపీలో తమకు బీజేపీ సహకరించటం అనే ఫార్ములాతో ఢిల్లీ కేంద్రంగా టీడీపీ -బీజేపీ పొత్తు దిశగా ప్రతిపాదించినట్లు సమాచారం.అయితే, చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ కు మరో అస్త్రం ఇచ్చినట్లు అవుతుందనేది తెలంగాణ బీజేపీ నేతల వాదన. దీంతో, టీడీపీ తో పొత్తు వద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ప్రధానితో ప్రత్యేకంగా భేటీ అయి అన్ని వివరాలు చర్చించేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే మరోసారి ఢిల్లీకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బీజేపీ - జనసేన విషయంలో వేచి చూసే ధోరణితోనే చంద్రబాబు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.
షర్మిలకు నేరుగా ప్రధాని ఫోన్ కాల్ తో...సీన్ రివర్స్
తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యతిరేకులకు బీజేపీ మద్దతిస్తోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలకు నేరుగా ప్రధాని ఫోన్ చేసారు. షర్మిలకు భరోసా ఇచ్చారు. ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. దీంతో, వచ్చే వారం షర్మిల ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. బీజేపీ - వైఎస్సార్టీపి కలిసి కూటమిగా తెలంగాణలో పోటీ చేసే సంకేతాలుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ అభిమానులు - తెలంగాణ లో రాజకీయంగా బలం ఉన్న ఒక సామాజిక వర్గం మద్దతు షర్మిల కూడగట్టగలుగుతారని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమాచారంతోనే టీఆర్ఎస్ నేతలు షర్మిల బీజేపీ వదిలిన బాణంగా విమర్శలు మొదలు పెట్టారు. ప్రధానితో భేటీ తరువాత ఈ రెండు పార్టీల మధ్య భవిష్యత్ కార్యాచరణ పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు టీడీపీ సహకరించేందుకు సిద్దంగా ఉన్నా.. షర్మిలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వటం ఇప్పుడు టీడీపీకి షాక్ గా మారింది. చంద్రబాబు ఢిల్లీలో ఉన్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో అధికారం కోసం బీజేపీతో తెలంగాణ నుంచే మైత్రి ప్రారంభించాలనే టీడీపీ అధినేత ప్రయత్నాలకు ప్రధాని మోదీ ఒకే ఒక్క ఫోన్ కాల్ తో గండి కొట్టినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో, ఇప్పుడు ప్రధాని - షర్మిల సమావేశం అటు తెలంగాణ..ఇటు ఏపీలో రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.