గోరంట్ల మాధవ్ కేసులో మరో ట్విస్ట్- మార్ఫింగ్ తేలకముందే-వైసీపీ సోషల్ మీడియా వాలంటీర్ ఫిర్యాదు
నగ్న వీడియోతో దొరికిపోయిన వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకునే విషయంలో ఆ పార్టీ ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ విపక్ష టీడీపీ, జనసేన ఒత్తిడి పెంచుతున్నాయి. అదే సమయంలో బయట ఈ వ్యవహారంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వైసీపీకి చెందిన ఓ సోషల్ మీడియా మహిళా వాలంటీర్ కూడా చిక్కుల్లో పడింది.
గోరంట్ల మాధవ్ వీడియో చిచ్చు
వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నవీడియో వ్యవహారం ఆ పార్టీతో పాటు రాష్ట్రంలోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మాధవ్ తప్పుచేశారా లేదా అన్నది ఇంకా తేలకపోవడంతో వైసీపీ కూడా చర్యలు తీసుకునే విషయంలో ఆలోచిస్తోంది. అదే సమయంలో మహిళా కమిషన్ జోక్యంచేసుకుని విచారణ చేయాలని డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఒక్క వ్యవహారంతో వైసీపీలో మహిళా నేతలంతా పూర్తిగా సైలెంట్ అయిపోతున్న పరిస్దితి. నిన్న మొన్నటివరకూ ఆడపిల్లకు అన్యాయం జరిగితే జగన్ గన్ కంటే ముందే వస్తారని సవాళ్లు విసిరిన వారంతా ఇప్పుడు మౌనంగా ఉండిపోక తప్పని పరిస్ధితి.
మాధవ్ ఎపిసోడ్ లో ట్విస్ట్
మాధవ్ ఎపిసోడ్ లో ఆ నగ్నవీడియో మార్ఫింగ్ చేసిందా కాదా అన్నది ఇంకా తేలనే లేదు. అప్పుడే దీనిపై మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. విపక్షాలకు ఈ వీడియో దొరకడంతో దాంతో ఆడుకోవడం మెదలుపెట్టేశాయి. ఆ వీడియోలోనే వైసీపీకి చెందిన ఓ మహిళా వాలంటీర్ ను చొప్పించి దాన్ని వైరల్ చేయడం మొదలుపెట్టాయి. సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. దీంతో సదరు మహిళా వాలంటీర్ ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలు జరిగిందిదీ..
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లో తన ఫోటోను పెట్టి మార్ఫింగ్ చేశారని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అనితా రెడ్డి ఇవాళ శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు ఎంపీ మాధవ్ వీడియో కాల్ వ్యవహారంలో.. ఆయన పక్కన తన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తనపై దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని అనితారెడ్డి ఆరోపించారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గాండ్లపెంట పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. తాను నాలుగేళ్లుగా వైసీపీ సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నానని..అప్పటినుంచి టీడీపీకి చెందిన వారు తనను టార్గెట్ చేశారని అనితారెడ్డి చెబుతున్నారు. తన ఫొటో మార్ఫింగ్ చేసిన, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారందరిపై చర్య లు తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.