ఇది రాసిపెట్టుకో బాబు... వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి ఆ పరిస్థితి తప్పదు... విజయసాయి సవాల్...
కరోనా కట్టడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,ఎమ్మెల్సీ లోకేష్ చేస్తున్న విమర్శలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆశలన్నీ చెల్లాచెదురైన తర్వాత తండ్రీ కొడుకుల భాష మారడంలో వింతేమీ లేదన్నారు. పార్టీ లేదు బొక్కా లేదని స్వయంగా పార్టీ అధ్యక్షుడే అన్నాక సంస్కార హీన వీరంగాలు ఇలాగే ఉంటాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో లాగే ఏపీలోనూ టీడీపీకి అభ్యర్థులు దొరకరని... ఇది రాసి పెట్టుకో బాబు అంటూ సవాల్ విసిరారు.
'పాపాలు చేసిన వారిని దేవుడు క్షమిస్తాడేమో కానీ తమను నిలువునా దోచుకుని, మాఫియా పాలనతో పీడించిన బాబు లాంటి వారిని ప్రజలు అస్సలు మన్నించరు. వరస పరాజయాలు అందుకే. నిజాయితీ విలువ తెలియని వ్యక్తులు పరాజయాల భారం కింద నలిగిపోక తప్పదు.' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని తండ్రీ కొడుకులు ఎన్నడూ కోరుకోరంటూ చంద్రబాబు,లోకేశ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడి విషయంలో సీఎం జగన్ విఫలమయ్యారని ఏడవడానికి, దేశమంతా మహమ్మారి అదుపులోకి వచ్చినా... ఏపీలో మాత్రం శవాల దిబ్బలు కనిపించాలని 'వాళ్ల దేవుళ్లకు' మొక్కుతుంటారని విజయసాయి విమర్శించారు. చంద్రబాబు,లోకేశ్ల ఆలోచనలు పిశాచాల కంటే క్రూరాతి క్రూరంగా ఉంటాయని మండిపడ్డారు.
మరో ట్వీట్లో 'అప్రతిహతంగా సాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఆశలు చూపించాలి గానీ అమలుచేస్తే ఎలా అనే మైండ్ సెట్తో ఉన్న వ్యక్తి అయోమయంలో పడ్డాడు. జీవన ప్రమాణాలు పెరిగి జనం చైతన్యవంతులైతే ఇక తమకు పుట్టగతులుండవనే భయం పట్టుకుంది.' అని విజయసాయి విమర్శించారు.కరోనా నియంత్రణ,పరీక్షలు,వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు. అయినా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన చంద్రబాబు,అద్దె మెకులు,అను'కుల' మీడియా రాద్దాంతం కొనసాగుతోందని విమర్శించారు. కష్టకాలంలో బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు చంద్రబాబుకు ప్రజలు తప్పక బుద్ది చెబుతారని హెచ్చరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం(మే 5) వర్చువల్గా పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజల ప్రాణాలు కాపాడటంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. కర్నూలు జిల్లాలో పుట్టిన ఎన్-440 వేరియంట్ ఆందోళన కలిగిస్తోందని... ఏపీ నుంచి వస్తున్న కొత్త స్ట్రెయిన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని గుర్తు చేశారు. ఓవైపు కరోనా ఉధృతి కొనసాగుతుంటే.. కేబినెట్ భేటీలో దానికి ప్రాధాన్యత లేకపోవడం దారుణమన్నారు. వ్యాక్సినేషన్పై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. వ్యాక్సినేషన్పై సీఎం సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు.
Recommended Video