పంచాయతీలకు జగన్ ఝలక్-సచివాలయాల భారం మీదే ! అధికారాలు లాక్కున్నది కాక..
ఏపీలో గ్రామ సచివాలయాల వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే పంచాయతీలకు రాజ్యాంగం ప్రకారం దఖలు పడిన అధికారాల్ని సచివాలయాలకు కట్టబెట్టిన జగన్ సర్కార్.. హైకోర్టు తీర్పుతో వాటిలో సవరణలు చేసింది. ఇప్పుడు మరోసారి సచివాలయాల నిర్వహణకు సంబంధించిన బిల్లుల్ని పంచాయతీలకు పంపడంతో పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందన్న సంకేతాలు కూడా పంపింది.
పంచాయతీలు వర్సెస్ సచివాలయాలు
రాజ్యాంగంలో గ్రామ పంచాయతీలకు ఇచ్చిన హక్కులు, అధికారాలను గ్రామ సచివాలయాలకు పంచుతూ వైసీపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా గ్రామ సచివాయాల అధికారాల్ని వీఆర్వోలకు అప్పగిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పమైంది. హైకోర్టు ఉత్తర్వుల అనంతరం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటికి సమాంతరంగా సచివాలయాల ఏర్పాటు ఎందుకన్న హైకోర్టు ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకలేదు. అంతే కాదు ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురైంది.
పంచాయతీ నిధులపై సర్కార్ కన్ను
పంచాయతీలకు అరకొర నిధులు మాత్రమే ఉంటాయి. వాటికి ఏటా ఆర్ధికసంఘం నుంచి నేరుగా వచ్చే నిధుల్ని కూడా ప్రభుత్వం ఇప్పటికే మళ్లించేయడం లేదా విద్యుత్ ఛార్జీల బకాయిలు వంటి ఇతర అవసరాల పేరుతో మళ్లించేసుకోవడం జరుగుతోంది. కొన్నిసార్లు సర్పంచ్ లకు సమాచారం ఇవ్వకుండానే వారి అకౌంట్లలో నిధులు మళ్లించేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం పంచాయీతీలకు మరో షాకిచ్చింది. అదీ తమకు సమాంతరంగా ఏర్పడిన గ్రామ సచివాలయాల భారం కూడా మీరే భరించాలని ఆదేశాలు ఇస్తోంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లు గగ్గోలు పెడుతున్నారు.
సచివాలయాల బిల్లులు పంచాయతీలకు
ప్రభుత్వం 2019లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు కాగానే వాటికి ఒక్కోదానికి రెండు కంప్యూటర్లు, ఓ ప్రింటర్ చొప్పున సరఫరా చేసింది. వీటి బిల్లులు సదరు వెండర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా.. చెల్లించలేదు. హైకోర్టు జోక్యంతో ఈ బిల్లుల్ని గ్రామ పంచాయతీలకు పంపుతూ పశ్చిమగోదావరి జిల్లా డీపీవో ఆదేశాలు పంపారు. ఇందులో డీపీవో ఒక్కో కంప్యూటర్ కు రూ.38965, ప్రింటర్ కు రూ.10943 చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు గ్రామ సచివాలయాల బిల్లులు మేమెందుకు కట్టాలన్న ప్రశ్న పంచాయతీల నుంచి ఉత్పన్నమవుతోంది.
పంచాయతీలకు షాకులే షాకులు
ఇప్పటికే తమకు ఆర్ధిక సంఘం ఇచ్చిన నిధుల్ని సైతం మళ్లించేసుకుంటున్న ప్రభుత్వం.. ఇఫ్పుడు సచివాలయాల నిర్వహణలో భాగంగా సరఫరా చేసిన పరికరాలకు బిల్లులు పంచాయతీలకు పంపడం వివాదాస్పమవుతోంది. 2019లో పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన ఓ ఉత్తర్వు ప్రకారం ఈ బిల్లులు పంచాయతీలకు పంపుతున్నట్లు పశ్చిమగోదావరి జిల్లా డీపీవో తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో మిగతా జిల్లాల డీపీవోలు కూడా ఇలాగే సచివాలయాల బిల్లుల్ని పంచాయతీలకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. అధికారాలు, నిధుల విషయంలో రాజ్యాంగం ప్రకారం స్వతంత్రత ఉన్న పంచాయతీలపై ఇలా సచివాలయాల భారం వేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది.