రాజధాని ప్రస్తావన ఏదీ: గవర్నర్ ప్రసంగంలో లేని అమరావతి: జగన్ ఆలోచన మారుతోందా..!
ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం పూర్తయింది. అందులో జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు..నవరత్నాల అమలు గురించి ప్రధా నంగా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు. సంక్షేమ పధకాల అమలు గురించి వివరించారు. ఏ వర్గానికి ఏం చేసేదీ చెప్పుకొచ్చారు. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు. కానీ, ఏపీ రాజధాని ప్రస్తావన మాత్రం లేదు. అమరావతి గురించి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకపోవటం ఇప్పుడు అనేక అనుమానాలకు కారణమవుతోంది.

అమరావతి ప్రస్తావన ఏదీ..
గవర్నర్ నరసింహన్ దాదాపు అరగంట సేపు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో...ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి ప్రాధాన్యత ఇచ్చారు. నవరత్నాల అమలును వివరించారు. ఉద్యోగులకు మధ్యంత భృతితో పాటుగా ఆశా వర్కర్లకు జీతాల పెంపు.. అవినీతి రహిత పాలన వంటి అంశాలను గవర్నర్ ప్రసంగంలో చోటు చేసుకున్నాయి. ఆర్టీసీ విలీనం గురించి కమిటీ వేసిన అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించామని..త్వరిత గతిన ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, కీలకమైన గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా అమరావతి ప్రస్తావన లేదు. ఏపీకీ కీలకమైన రాజధాని గురించి గవర్నర్ స్పీచ్లో అమరావతి గురించి చెప్పకపోవటం పైన టీడీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీని ద్వారా అమరావతి విషయంలో అసలు జగన్ ఆలోచన ఏంటనే అంశం పై చర్చ మొదలైంది.

టీడీపీ నేతల అభ్యంతరం..
గవర్నర్ ప్రసంగం సొంత ప్రసంగం కాదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. గవర్నర్ ప్రసంగంలో చాలా అంశాలపై స్పష్టత లేదని చెప్పారు. గవర్నర్ ప్రసంగం నవరత్నాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని గురించి ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. చేతి, కుల వృత్తుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదని వ్యాఖ్యానించారు. అదే విధంగా టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి సైతం స్పందిస్తూ పూర్తి మెజార్టీ ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని, ఎప్పుడు తెస్తారో చెప్పాలన్నారు. వైసీపీ కార్యకర్తలకు నెలకు రూ.5 వేల చొప్పున.. రూ.11 వేల కోట్లు దోచిపెట్టడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు వైసీపీ తీరు ఉందని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

జగన్ ఆలోచన మారుతోందా..
ఏపీ రాజధాని విషయంలో జగన్ తొలి నుండి అక్కడ భూముల పేరుతో జరుగుతున్న దోపిడీ పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఢిల్లీలో జరిగిన తొలి మీడియా సమావేశంలోనూ జగన్ రాజధాని భూముల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని భూ స్కాం చాలా పెద్దదని..దీని పైన విచారణ చేయించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో రాజధాని పరిసర గ్రామాల్లో బలంతంగా భూములు సమీకరించారో వాటి పైనా నేటి ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లుగా చెబుతున్నారు. నిజంగా ముఖ్యమంత్రి జగన్ రాజధాని భూముల పైన విచారణకు నిర్ణయిస్తే.. అది అమరావతి నిర్మాణం పైన ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. అయితే, జగన్ రాజధాని నిర్మాణం కంటే..అవినీతి లేని అమరావతి కోరుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు జగన్ అమరావతి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications