ఏపీలో మద్యంపై సర్కారుకు భారీ ఆదాయం -6 నెలల్లోనే 10,675 కోట్ల రాబడి : టీడీపీ హయాం కంటే ఎక్కువ..!!
ఏపీలో మద్యం పైన ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ అప్పట్లోనే ప్రకటించారు. ఇక, అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 1446 మద్యం షాపులు తగ్గించారు. 43 వేల బెల్టు షాపులు తొలగించారు. షాపుల పనివేళలు కుదించారు. షాపుల్లో తాగడానికి అవకాశం ఉన్న పర్మిట్ రూమ్లు రద్దు చేశారు. కానీ, మద్యం అమ్మకాలు మాత్రం తగ్గలేదు. పైగా గతం కంటే ఆదాయం పెరిగింది. మద్యం పైన షాక్ కొట్టేలా ధరలు పెంచామని ప్రభుత్వం ఓపెన్ గా చెబుతోంది.
దుకాణాలు తగ్గాయి.. ఆదాయం పెరిగింది
నిషేధం లో భాగంగా ఇదీ ఒక అడుగుగా చెప్పుకొస్తోంది. ప్రతీ నెలా ఏపీ ప్రభుత్వానికి మద్యం ద్వారా రూ 1800 కోట్లు సమకూరుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6నెలల్లో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.10,675 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ రూ.734 కోట్లు, అదనపు ఎక్సైజ్ డ్యూటీ రూ.687 కోట్లు, ప్రివిలేజ్ ఫీజు రూ.39కోట్లు, రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూ.251 కోట్లు, అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూ.3740కోట్లు, వ్యాట్ రూ.3639కోట్లు, ఇతరత్రా రూ.1583కోట్లు.. వెరసి రూ.10,675 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యంపై 6నెలల్లోనే ఇంత ఆదాయం రావడం ఇదే తొలిసారి.
టీడీపీ హాయం కంటే ఎక్కువగా
టీడీపీ ప్రభుత్వంలో ఏడాదికి గరిష్ఠంగా రూ.17,300 కోట్లు మాత్రమే వచ్చింది. అయితే దశలవారీగా మద్యపాన నిషేధం అని చెప్పిన వైసీపీ ప్రభుత్వంలో రాబడి అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. 2019-20 లో రూ.17,707కోట్లు, 2020-21లో రూ.18,005 కోట్లు ఆదాయం వచ్చింది. రానురాను తాగుడు తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల ఆదాయం తగ్గాల్సి ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో అది మరింత పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురాకుండా చట్టాలను సవరించింది.
నాటు సారా.. బెల్టు షాపులకు అడ్డుకట్ట
అలాగే నాటుసారాపై వరుస దాడులు చేయిస్తోంది. సిబ్బందికి సెలవులు తగ్గించి మరీ దాడులు చేయిస్తోంది. ఇదంతా అక్రమాల నివారణ కోసమని ప్రభుత్వం చెబుతోంది. గతంలో ఉన్న బ్రాండ్లు మారిపోయాయి. కొత్త బ్రాండ్లతో అమ్మకాలు చేసుకుంటున్నారనే రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో ధరలు పెంచినా మద్యం రెవిన్యూ మాత్రం తగ్గటం లేదు. అమ్మకాలు తగ్గినా..పెరిగినా, ఆదాయం మాత్రం తగ్గటం లేదు. అయితే, గతంలో టీడీపీ హయాం కంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం రావటం పైన ఇప్పుడు చర్చ మొదలైంది.
Recommended Video
మద్యపాన నిషేధం పై ఎలా ముందుకు
ఇప్పటికే రెండున్నారేళ్ల పాలన పూర్తి చేసుకున్న జగన్ సర్కార్ మిగిలిన కాలంలో మద్యాపాన దశల వారీ నిషేధంలో భాగంగా..ఎటువంటి కార్యాచరణ అమలు చేస్తారనేది చూడాలి. ఇప్పుడు మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయం రాష్ట్ర రెవిన్యూకూ కీలకంగా మారుతోంది. ఇదే సమయంలో ఆర్దికంగా కష్టాల్లో ఉన్న సమయంలో మద్యం ఆదాయం పైన ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.