ట్రంప్ 87 కు కౌంటర్ గా మోడీ 55 ఆఫర్ ?- తాజా ప్లాన్ ఇదే..!
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ వస్తువుల ఎగుమతులపై పన్నులు విధిస్తున్న దేశాలపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ .. భారత్ తో పాటు పలు దేశాలకు నేరుగానే వార్నింగ్ లు ఇచ్చారు. మీరు మా వస్తువులపై ఎంత శాతం పన్ను విధిస్తే తాను కూడా అంతే శాతం పన్ను వారి వస్తువులపై విధిస్తానంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ బాగానే పనిచేస్తోంది. ట్రంప్ ఆగ్రహం గమనించిన ఆయా దేశాలు ఇప్పటికే అమెరికా నుంచి వచ్చే వస్తువులపై పన్నులు తగ్గించేస్తున్నాయి.
ఇదే క్రమంలో భారత్ కూడా అమెరికాతో ఎగుమతులు, దిగుమతులపై పన్నుల విషయంలో తీవ్ర స్ధాయిలో చర్చలు జరుపుతోంది. భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇరు దేశాలూ పన్నుల తగ్గింపు విషయంలో పట్టు విడుపులు ప్రదర్శించాలని చెబుతున్న కేంద్రం.. అందుకు తగ్గట్టుగానే తమ పన్నులు తగ్గించేందుకు సిద్దమవుతోంది. త్వరలో దీనిపై కీలక ప్రకటన రానుంది.

భారతదేశ అంతర్గత విశ్లేషణ ప్రకారం అమెరికా కొత్త సుంకాలు ఆ దేశానికి భారత ఎగుమతుల్లో 87శాతం ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటి విలువ దాదాపు $66 బిలియన్లు ఉంటుందని అంచనా. అయితే అమెరికా ఎగుమతులపై భారత్ విధిస్తున్న పన్నుల వల్ల పడే ప్రభావం అంతకంటే ఎక్కువగా ఉంది. రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగా 23 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతుల్లో సగానికి పైగా సుంకాలను తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెండు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
భారతీయ వస్తులపై అమెరికా పన్నుల ప్రభావాన్ని నివారించడానికి ప్రస్తుతం 5%, 30% మధ్య పన్ను విధించబడుతున్న 55% అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిలో కొన్ని సుంకాలను గణనీయంగా తగ్గించవచ్చని, మరికొన్నింటిని పూర్తిగా తొలగించవచ్చని తెలుస్తోంది. ఈ ప్రతిపాదన ఇంకా చర్చలో ఉందని, దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications