Survey సంచలనం: కేంద్రంలో మళ్లీ మోడీ.. ఏపీలో పవర్ ఎవరిది?
అమరావతి: భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. త్వరలో జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వెల్లువెత్తుతోన్న వేళ.. ఇటు ఏపీ-తెలంగాణల్లో అధికార పార్టీలు రెండు ముందస్తుకు ముహూర్తం చూసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్.. కలకలం రేపుతోంది.
రాజెవరు? బంటెవరు?
ఇండియా టీవీ నిర్వహించిన ఒపీనియన్ పోల్ ఇది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాలకు ఇప్పటికప్పుడు ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. పరిస్థితేమిటనేది స్పష్టం చేసింది. ఎవరు రాజవుతారు? ఎవరు బంటు అవుతారనేది తేల్చి చెప్పింది. కేంద్రంలో అధికారంలో ఎవరు వస్తారనేది కుండబద్దలు కొట్టింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక లోక్సభ స్థానాలు ఎవరి ఖాతాలో పడతాయనేది వెల్లడించింది. రాష్ట్రాలు, పార్టీల వారీగా మెజారిటీ లోక్సభ స్థానాల్లో ఎవరి జెండా ఎగురుతుందనేది తేల్చేసింది.
కేంద్రంలో మళ్లీ మోడీ..
ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం- కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. ఇప్ప్పుడున్న లోక్సభ స్థానాల కంటే కూడా అధిక సీట్లను ఎన్డీఏ కూటమి తన ఖాతాలో వేసుకోగలుగుతుంది. తన మెజారిటీని భారీగా పెంచుకోగలుగుతుంది. ప్రతిపక్ష పార్టీలపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించగలుగుతుంది.
మరిన్ని సీట్లు..
మొత్తంగా 362 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు విజయం సాధిస్తాయి. ఎన్డీఏతో గానీ, అందులోని భాగస్వామ్య పక్షాలతో గానీ సంబంధం లేకుండా బీజేపీ సింగిల్గా 326 సీట్లను కైవసం చేసుకుంటుంది. ప్రస్తుత లోక్సభలో బీజేపీకి ఉన్న సంఖ్యాబలం కంటే ఇది అధికం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన సీట్ల సంఖ్య కంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సాధించే సీట్ల సంఖ్య ఎక్కువ.
ఏపీలో వైఎస్ జగన్ హవా..
ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు ఉండగా.. అందులో 19 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధిస్తారని పేర్కొంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆరు లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితమౌతారని అంచనా వేసింది. అంటే- ప్రస్తుతం టీడీపీకి ఉన్న లోక్సభ స్థానాల సంఖ్య మూడు. దీన్ని రెట్టింపు చేసుకోగలుగుతుంది. వైసీపీలో ఖాతా నుంచి మాత్రం మూడు స్థానాలు తగ్గుతాయి. బీజేపీకి దక్కే లోక్సభ స్థానాల సంఖ్య.. జీరో.
లెక్కలో లేని జనసేన..
ఈ ఒపీనియన్ పోల్ కోసం ఇండియా టీవీ.. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీని లెక్కలోకి తీసుకోలేదు. బీజేపీ-జనసేన పొత్తులో కొనసాగుతున్నాయని భావించి ఉండొచ్చు. తాజాగా ఒపీనియన్ పోల్- వైఎస్ఆర్సీపీలో ఉత్సాహాన్ని నింపినట్టయింది. 175కు 175 అసెంబ్లీ స్థానాలను లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్కు మాత్రం కొంత నిరుత్సాహాన్ని కలిగించినట్టే. క్లీన్ స్వీప్ సాధ్యపడదని ఈ పోల్ స్పష్టం చేసింది.
తెలంగాణలో..
ఇక తెలంగాణ విషయానికి వస్తే- లోక్సభ స్థానాల విషయంలో టీఆర్ఎస్ పట్టు నిలుపుకొన్నట్టే కనిపిస్తోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా.. అందులో ఎనిమిది టీఆర్ఎస్కు దక్కుతాయి. బీజేపీ ఆరుచోట్ల విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ లేదా ఇతరులు మూడు సీట్లకే పరిమితమౌతాయి. ఈ నిష్పత్తిని అసెంబ్లీ ఎన్నికలకూ అన్వయించుకుంటే.. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమౌతుంది.