బీజేపీ సభ్యత్వ నమోదు: బాలయ్య ఇలాకాలో పురంధేశ్వరి సందడి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఆయన సోదరి, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి సోమవారం సందడి చేశారు. హిందూపురంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంలో ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయంగా పెట్టుబడులు ఆకర్షించి దేశాన్ని అగ్రపథంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని ఆమె అన్నారు.
రాష్ట్రానికి తక్షణ ప్రోత్సాహం కింద రూ. 850 కోట్లు కేంద్రం కేటాయించిందని, రానున్న కాలంలో మరిన్ని నిధులు కేటాయిస్తుందని పురందేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రధాని మోడీకి వీసా నిరాకరించిన అమెరికా నేడు ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణవర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.