విపత్తు పునరుద్ధరణ: ఏపికి ప్రపంచ బ్యాంక్, కేంద్రం బాసట
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో విపత్తు పునరుద్ధరణ పనులకు ప్రపంచ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలిచాయి. విపత్తు పునరుద్ధరణ పనులకుగాను ప్రపంచ బ్యాంకు సుమారు 250 మిలియన్ డాలర్లు (రూ.1500 కోట్లకుపైగా) రుణంగా ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు మధ్య ఆర్థిక ఒప్పందం కుదిరింది.
గురువారం నార్త్బ్లాక్లో జరిగిన కార్యక్రమంలో కేంద్రం తరపున ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్ సెల్వకుమార్, ప్రపంచ బ్యాంకు తరఫున భారతదేశ డైరెక్టర్ ఒన్నో రుల్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఏపీ తరపున భూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి జగదీశ్ చందర్ శర్మ సంతకం చేశారు.
ఏపీలో ఏర్పడే విపత్తుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాల పెంపునకు, ఆయా ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఈ నిధుల్ని వినియోగించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలు నేరుగా ఈ పథకంతో లబ్ధి పొందనున్నారు. ఈ జిల్లాల జనాభా సుమారు 13.3 మిలియన్లుగా ఉంది.
కాగా, ఈ ప్రాజెక్టులో భాగంగా.. విద్యుత్తు సరఫరా వ్యవస్థను బలోపేతం చేయటం, రహదారుల పునరుద్ధరణ, మొదలైన కార్యక్రమాలను అమలు చేయనున్నారు. ఐదేళ్ల కాలంలో ఏపీ సర్కార్ ఈ పనులు చేపట్టాల్సి ఉంటుంది.
ఏపి, ఒడిశాలకు వరం: కేంద్ర కేబినెట్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో తుఫాను ప్రమాద ఉపశమన పథకం(నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు) మొదటి దశ అంచనాలను రూ.835 కోట్ల మేర పెంచుతూ కేంద్ర కేబినెట్ గురువారం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ ప్రాజెక్టు అంచనాలు రూ.1496.71 కోట్లు కాగా, ఆ మొత్తాన్ని కేంద్రం రూ.2331.71కి పెంచింది.
ఏపీ, ఒడిశా కోస్తా తీరంలో ఉండే మత్స్యకారులు, పేద ప్రజలు ఈ కేంద్ర ప్రాయోజిత పథకంతో లబ్ధి పొందనున్నారు. దీనికి కేంద్రం రూ.1843.94 కోట్లను ప్రపంచ బ్యాంకు రుణం రూపంలో ఇస్తుంది. మిగతా రూ.487.77 కోట్లను ఏపి, ఒడిశా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.