ఇండియన్ రైల్వే సంచలన నిర్ణయం
భారతీయ రైల్వే సరికొత్త ఆలోచన చేస్తోంది. దీనివల్ల రెండు లాభాలుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రయాణికుల రైళ్లు, సరకు రవాణా రైళ్లు వేర్వేరుగా నడుస్తుండేవి. అయితే ఒకేసారి అటు ప్రయాణికులతోపాటు ఇటు సరకులను కూడా రవాణా చేయాలని రైల్వే భావిస్తోంది. అందుకనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటోంది.
పైన ప్రయాణికులు : డబుల్ డెక్కర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంద్వారా ఇటువంటి ప్రయోగం చేయాలనుకుంటోంది. పై అంతస్తులో ప్రయాణికులు, కింద సరకులు ఏకకాలంలో రవాణా చేయబడతాయి. కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తున్నారు. బెల్లీ ఫ్రైట్ కాన్సెప్ట్ తో నడవనున్నాయి. ఒక్కో కోచ్ తయారీకి రూ.2.70 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ్యయం కానుంది. ఎగువ కోచ్ లో 46 మంది ప్రయాణికులు, కింద 6 టన్నుల సరుకును రవాణా చేయనున్నారు.

ట్రయల్ పూర్తయిన తర్వాత : కరోనా వచ్చిన సమయంలో రైల్వేకు ఈ ఆలోచన వచ్చింది. మూడు డిజైన్లను రూపొందించి రైల్వే బోర్డుకు పంపగా అందులో ఒకదాన్ని ఓకే చేశారు. పూర్తి ఏసీతో రైలును రూపొందిస్తారు. వీటి డిజైన్లు చాలా ప్రత్యేకమైనవని అధికారులు తెలియజేస్తున్నారు. ఒక కోచ్ నమూనా తయారుచేసి రైల్వే మంత్రిత్వ శాఖకు, అక్కడి నుంచి ఆర్ అండ్ డీ విభాగానికి పంపిస్తారు. ట్రయల్ పూర్తయిన తర్వాత మొత్తం కోచ్ లను తయారుచేస్తారు.
ప్రతి రైలుకు 20 బోగీలు : ప్రతి రైలులో 20 కోచ్ లు ఉండనున్నాయి. కార్గోలైనర్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నారు. షెడ్యూల్ చేసిన మార్గాల్లో ఒకేసారి ప్రయాణికులు, సరుకులు రవాణా అవుతాయి. రెండు రైల్వేస్టేషన్ల మధ్య ఆర్డర్లను స్వీకరించి ఆ వస్తువులను తీసుకువెళుతుంది. ఇంతకుముందు ప్రయాణికులు ముందుగానే చేరుకోగా.. తర్వాత వారు పార్శిల్ చేసిన వస్తువు వస్తుంది. ఇదంతా చాలా ఆలస్యంగా జరిగే ప్రక్రియ. అయితే డబుల్ డెక్కర్ ద్వారా ఈ సమస్యకు భారతీయ రైల్వే చరమగీతం పాడుతోంది.












Click it and Unblock the Notifications