కొత్త రైలు మార్గం: అమరావతి నుంచి గుంటూరుకు 'మెము' రైళ్లు
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో మెము రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) రైళ్లను రెండు దగ్గరి ప్రదేశాల మధ్య షటిల్ సర్వీస్ మాదిరి నడుపుతుంటారు.
ఏపీలో ఇప్పటికిప్పుడు మెట్రో రైళ్లు నడపడడం సాధ్యం కాని పని కాబట్టి, అందుకు ప్రత్యామ్నాయంగా ఈ మెము రైళ్లపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం రైళ్లను నడిపేందుకు అధ్యయనం చేయాలని కేంద్ర రైల్వే శాఖను ఆదేశించింది.
దీంతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతానికి గుంటూరు నుంచి రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఇందుకోసం నంబూరు రైల్వేస్టేషన్ నుంచి అమరావతికి ప్రత్యేక రైలు మార్గం కూడా నిర్మించే అవకాశం ఉందని రైల్వే వర్గాల సమాచారం.
అమరావతికి అన్ని విధాలా న్యాయం చేసేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ విషయంపై చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలో జనాభా పెరిగేంత వరకు మెము రైళ్లను నడపడమే మంచిదని కేంద్రం భావిస్తోంది.
16 కోచ్లతో ఈ మెము రైళ్లను గుంటూరు నుంచి అమరావతికి నడపవచ్చని తెలుస్తోంది. ఒక్కో కోచ్లో 70 మంది కూర్చునే వీలుంటుందట. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరిస్తే కొత్త రైలు మార్గాన్ని నెలల్లోనే నిర్మిస్తామని ఇటీవల గుంటూరు పర్యటనకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.