అక్కడి భారతీయులను ఆదుకోండంటూ ఫోన్: పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో యూకే(బ్రిటన్)లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారతీయ విద్యార్థుల భయాందోళనలను ట్విటర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
Recommended Video
కేంద్రమంత్రికి పవన్ కళ్యాణ్ ఫోన్..
గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్తో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఫోన్లో మాట్లాడారు. యూకేలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు అవసరమైన ఆహార, వసతి సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కరోనా వ్యాప్తి మూలంగా వారు, వారి తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారు.
కేంద్రమంత్రి నుంచి హామీ..
"లండన్ లో ఉన్న హై కమిషన్ కార్యాలయ అధికారులు ఆ విద్యార్థులకు సహాయం అందిస్తారు. ఎవరూ ఆందోళన చెందవద్దు. వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటాం" అని కేంద్ర మంత్రి.. పవన్ కళ్యాణ్కు చెప్పారు. మురళీధరన్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్తోనూ ఈ అంశంపై ఫోన్ లో సంభాషించారు. లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయం పవన్ కల్యాణ్ విజ్ఞప్తికి స్పందించి అక్కడ చిక్కుకున్న విద్యార్థులకు సంబంధించిన వారి వివరాలు అందించాలని కోరింది. వారిని సంప్రదిస్తామని తెలిపింది.
తెలుగువారి కోసం ఆ రాష్ట్రాల సీఎంలతో పవన్..
కాగా, ఇటీవల తమిళనాడు, మహారాష్ట్రలో చిక్కుకున్న తెలుగువారి కోసం కూడా పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయడం, అధికారిక సోషల్ మీడియా ఖాతాలకు తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఆయా రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా స్పందించారు. తెలుగు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల పట్ల చూపిస్తున్న అభిమానానికి తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా ఆయనను అభినందించారు. మీలాంటివారి ప్రోత్సాహం ఉంటే మరింత ప్రజలకు సేవ చేస్తానని అన్నారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications