షర్మిల కు బిగ్ షాక్ - కీలక నేత రాజీనామా : జగన్ చెప్పిందే జరుగుతోందా-మూలాల మీద దెబ్బ..!!
తెలంగాణలో మంచి జోష్ తో పార్టీ ప్రారంభించిన వైఎస్ షర్మిలకు పార్టీ ఇంకా నిర్మాణం కాకముందే వరుస షాక్ లు తగులుతున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్థానంటూ పార్టీ ప్రకటించిన షర్మిల.. తన తండ్రి జన్మదినం జూలై 8న పార్టీని ప్రకటించారు. ఇప్పటి వరకు నిరుద్యోగుకు మద్దతుగా పోరాటం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి..ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలంటూ మూడు రోజుల దీక్ష చేసిన షర్మిల..ఇప్పడు ప్రతీ మంగళవారం దీక్షలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్..కేటీఆర్ పైన తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు.

పాదయాత్రకు సిద్దమవుతున్న వేళ..
ఇక, అక్టోబర్ 18 నుంచి చేవెళ్ల నుంచి పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. అయితే, ఇప్పటికే జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పినా..అమలు కాలేదు. కమిటీల ఏర్పాటులో నాయకుల మధ్య విభేదాలతో ఇప్పటికే ఒకరిద్దరు పార్టీకి రాజీనామా చేసారు. ఇక, ఇప్పుడు షర్మిలకు కుడి భుజంగా పార్టీలో వ్యవహరిస్తున్న ఇందిరా శోభన్ రాజీనామా చేసారు. పార్టీ ఏర్పాటు సమయం నుంచి ఇప్పటి వరకు అతి కొద్ది మంది ముఖ్యనేతలు మాత్రమే షర్మిలతో కంటిన్యూ అవుతున్నారు. అయితే, ఇందిరా శోభన్ తన రాజీనామా లేఖను షర్మిళకు పంపుతూ..అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

పార్టీ మూలాలను ప్రశ్నించే విధంగా లేఖ..
అవి ఏకంగా షర్మిల పార్టీ మూలాలను ప్రశ్నించేలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇందిరా శోభన్ తన లేఖలో షర్మిలక్క పార్టీలో ఉండకూడదని..అని రాసుకొస్తూ ప్రస్తావించిన అంశాలే ఇప్పుడు డిబేట్ కు కారణమవుతున్నాయి. అందులో.. రాజీనామాకు కారణం ఏంటంటే.. అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బతుకు బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం, కొట్లాడుతూనే ఉన్నాను.

షర్మిల పార్టీలో అవి అమలు కావా..
నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటా. అందుకు షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని.. అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నేను ఈ పార్టీకీ రాజీనామా చేశానంటూ ఇందిరా శోభన్ తన ప్రకటనలో వెల్లడించారు. దీని ద్వారా అవన్నీ షర్మిల పార్టీలో అమలు కావటం లేదనే అభిప్రాయం పరోక్షంగా ఇందిరా శోభన్ వ్యక్తం చేసారు. షర్మిలకు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఇందిరా శోభన్ ఈ రకంగా లేఖ రాయటం కలకలంగా మారింది. అయితే, తిరిగి కాంగ్రెస్ లో చేరటం కోసమే ఇందిరా శోభన్ రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.

జగన్ చెప్పిందే జరుగుతోందా..
ఇదే సమయంలో...షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న అన్న..ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పిన విషయాలే వాస్తవ రూపం దాల్చుతున్నాయి. షర్మిల పార్టీ ఏర్పాటు జగన్ కు ఇష్టం లేదంటూ అప్పట్లోనే చెప్పగా..పార్టీ నిర్వహణ అంత సులభం కాదని చెప్పినట్లుగా పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకో కూడదనేది తమ విధానమని స్పష్టం చేసారు. అయితే, షర్మిల మాత్రం ఇతర పార్టీల్లోని నేతలు తనకు అవసరం లేదని..ప్రజల్లో నుంచే కొత్త నేతలను తయారు చేసుకుంటానంటూ ధీమా వ్యక్తం చేసారు.

షర్మిల ధీమా పార్టీని నిలబెడుతుందా..
అయితే, క్షేత్ర స్థాయిలో పార్టీ నిర్మాణం ఇప్పటి వరకు జరగటం లేదు. ఒక వైపు అధికార టీఆర్ఎస్- ప్రతిపక్ష కాంగ్రెస్ - బీజేపీ పార్టీలు ఎత్తులు - పై ఎత్తులతో రాజకీయం చేస్తున్నాయి. కానీ, కేవలం మంగళవారం దీక్షలకు మాత్రమే ప్రస్తుతానికి వైఎస్సార్టీపీ పరిమితం అయింది. ఇక, ఇప్పుడు ఇందిరా శోభన్ లాంటి వారి రాజీనామా తో మరోసారి పార్టీ గురించి చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications