హైకోర్టు విభజనపై ఇంద్రకరణ్, పవన్ 'గోపాల గోపాల'పై ఫిర్యాదు
హైదరాబాద్: త్వరలో హైకోర్టు విభజన జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీలోని కేంద్రంతో సంప్రదించినట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మరవలేనిదని కొనియాడారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో త్వరలోనే హైకోర్టు విభజన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, న్యాయశాఖమంత్రిని కలిసి హైకోర్టు విభజన చేపట్టాలని కోరారన్నారు.
తెలంగాణ న్యాయవాదుల క్యాలెండరును ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. న్యాయవాదులకు ఇళ్లస్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామన్నారు.
గోపాల గోపాల చిత్రంపై న్యాయవాదుల ఫిర్యాదు
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల చిత్రం పైన ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో తమను కించపరిచే సన్నివేశాలున్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ సమీక్ష
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం మధ్యాహ్నం సమీక్షించనున్నారు. జీహెచ్ఎంసీతోపాటు మున్సిపల్ శాఖాధికారులతో సీఎం సమీక్షించి ఓ నిర్ణయానికి వస్తారు.