ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హేచరీస్ అధినేత ఉప్పలపాటి సుందరనాయుడు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హేచరీస్ అధినేత ఉప్పలపాటి సుందరనాయుడు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. పశు వైద్యుడిగా వృత్తి ప్రారంభించిన ఆయన.. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి అమితమైన కృషి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలితరం పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు.
ఏపీ పౌల్ట్రీ సమాఖ్య అధ్యక్షుడిగా సుందరనాయుడు సేవలందించారు. చిత్తూరులో బాలాజీ హేచరీస్ స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అనేకమంది యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారు. 1936 జులై 1న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కంపలపల్లెలో ఉప్పలపాటి సుందరనాయుడు జన్మించారు. తండ్రి గోవిందునాయుడు, తల్లి మంగమ్మలకు సుందరనాయుడుతో కలిపి మొత్తం ఐదుగురు సంతానం. అందరూ కలసి జీవించే ఉమ్మడి కుటుంబం వీరిది. మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుందరనాయుడు.. టి.పుత్తూరు పాఠశాలలో ప్రాథమిక విద్య, అరగొండ జడ్పీ హైస్కూల్లో ఉన్నత పాఠశాల విద్య, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత బొంబాయి వెటర్నరీ యూనివర్సిటీలో బీవీఎస్సీ పూర్తి చేశారు.
అనంతరం తన గ్రామంలోని యువతను చైతన్య పరచడానికి నేతాజీ బాలానంద సంఘాన్ని స్థాపించి, గ్రంథాలయాన్ని, క్రీడా పరికరాలను సమకూర్చారు సుందరనాయుడు. గ్రామస్థుల సహకారంతో సంఘానికి శాశ్వత భవనాన్ని నిర్మించారు. విద్యార్థి దశ నుంచే సమాజ సేవా దృక్పథం ఆయనకు అలవడింది. బీవీఎస్సీ పూర్తయిన తర్వాత కొంతకాలం చిత్తూరు జిల్లా పీలేరులో పశు వైద్యుడిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేశారు.
1964 డిసెంబర్ 9న సుందరనాయుడికి పెమ్మసాని సుజీవనతో వివాహం జరిగింది. అనంతరం చిత్తూరు, అనంతపురం, కృష్ణగిరి(తమిళనాడు)జిల్లాల్లో పశు వైద్యుడిగా సేవలందించారు. ఈ క్రమంలో రైతుల కష్టాలను దగ్గరనుంచి చూసిన ఆయన వారికి అదనపు ఆదాయాన్ని కల్పించాలన్న ఆలోచనల నుంచి పుట్టిందే కోళ్ల పెంపకం. కాగా, ఫౌల్ట్రీ రంగానికి సుందరనాయుడు చేసిన కృషిగానూ అనేక అరుదైన గౌరవాలు అందుకున్నారు.
పుణెలోని డాక్టర్ బీవీరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపక ట్రస్ట్రీగా వ్యవహరించారు. 'నెక్' జీవిత కాల ఆహ్వాన సభ్యుడిగా, ఏపీ ఫౌల్ట్రీ ఫెడరేషన్ శాశ్వత ఆహ్వాన సభ్యుడిగా, అంతర్జాతీయ ఫౌల్ట్రీ సైన్స్ అసోసియేషన్ సభ్యుడిగా, ఎగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ సుందరనాయుడు విశేష సేవలందించారు. అంతేగాక, న్యూజెర్సీ ప్రభుత్వం 'డూయర్ ఆఫ్ ద ఫౌల్ట్రీ ఇన్ సౌత్ ఇండియా' అవార్డుతో సుందరనాయుడిని సత్కరించింది. సుందరనాయుడు మరణంతో పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వసేలను కొనియాడారు.