అలా చెప్పినవాడెవడో.. : మూడు రాజధానులపై జీఎన్ రావు కీలక వ్యాఖ్యలు
అభివృద్ది వికేంద్రీకరణతోనే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుందని జీఎన్ రావు కమిటీ ఛైర్మన్ జీఎన్ రావు అన్నారు. 13 జిల్లాలను విశాఖ,ప్రకాశం,ఏలూరు,కడప నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ది వికేంద్రీకరణ సూచించామన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను సముద్ర తీరానికి దూరంగా పెట్టుకోవాలని సూచించినట్టు తెలిపారు. విశాఖ-విజయనగరం మార్గంలో భవనాలు నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పామన్నారు. ప్రాంతీయ అసమానతలు తగ్గించేలా ప్రభుత్వానికి సూచనలు చేశామన్నారు. తమ రిపోర్టులను కొందరు తగలబెట్టారని.. అది చాలా బాధాకరం అని వాపోయారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజినల్లో చేయాల్సిన అభివృద్ది గురించి కూడా సూచించామన్నారు.
విశాఖపట్నం ఇతర నగరాలకు దూరమన్న వ్యాఖ్యలను జీఎన్ రావు కొట్టిపారేశారు. సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉందని.. అయినప్పటికీ అవసరాల రీత్యా అక్కడికి వెళ్లట్లేదా అని బదులిచ్చారు. విశాఖ నగరానికి తరుచూ తుఫాన్ల బెడద ఉంటుంది కదా అన్న ప్రశ్నకు.. ఆ మాటకొస్తే హైదరాబాద్లోనూ తుఫాన్లు వస్తాయన్నారు. విశాఖకు ఉన్న ప్రతికూలతల గురించి కూడా రిపోర్టులో పేర్కొన్నామని.. వాటికి పరిష్కారాలు కనుగొనాలని సూచించినట్టుగా చెప్పారు. మూడు రాజధానుల మోడల్ను సీఎం జగన్ సౌతాఫ్రికా నుంచి తీసుకున్నారు కదా.. దాని చారిత్రక నేపథ్యంపై మీరేమైనా అధ్యయనం చేశారా అన్న ప్రశ్నను ఆయన పట్టించుకోలేదు. సీఎం ఆ వ్యాఖ్యలు చేసినట్టు తాను వినలేదన్నారు.
ఇక కర్నూలులో హైకోర్టు పెడితే... కేవలం జిరాక్స్ సెంటర్స్ పెరుగుతాయి తప్ప అభివృద్ది జరగదన్న విమర్శలను కూడా జీఎన్ రావు కొట్టిపారేశారు. అలా చెప్పినవాడెవడో అంటూ తీసిపారేశారు. హైకోర్టు వస్తే ఇతర ట్రిబ్యునల్స్ కూడా వస్తాయని.. అభివృద్దికి అవి కూడా తోడ్పడుతాయని అన్నారు. 125 టీఎంసీల నీళ్లు అక్కడ అందుబాటులో ఉన్నాయని.. వాటిని రాయలసీమలోని నాలుగు జిల్లాలు సరిగా ఉపయోగించుకుంటే అభివృద్ది జరుగుతుందని సూచించామన్నారు.
మూడు రాజధానుల ఏర్పాటు తెలంగాణకే లాభమన్న విమర్శలను కూడా జీఎన్ రావు కొట్టిపారేశారు. కమిటీ రిపోర్టు కోసం ఢిల్లీ,అహ్మదాబాద్,బెంగళూరు,హైదరాబాద్లకు చెందిన ఆయా రంగాల్లో నిష్ణాతులైనవారు పనిచేశారని చెప్పారు. వారందరికీ దాదాపుగా 40-50 ఏళ్ల అనుభవం ఉందని.. విలువైన సలహాలు,సూచనలు ఇచ్చారని తెలిపారు. గత నివేదికలను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో డేటాను సేకరించిన తర్వాత నివేదికను రూపొందించినట్టు స్పష్టం చేశారు.