దేశంలో అసమానతలు;ప్రభుత్వాల్లో వ్యక్తి పూజ తగదు:సుప్రీంకోర్టు జడ్జి జాస్తి చలమేశ్వర్
విజయవాడ: భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వాలలో వ్యక్తి పూజకు విపరీతమైన ప్రాధాన్యత ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ చెప్పారు. కానీ ప్రజాస్వామ్యంలో వ్యక్తి పూజ తగదని అన్నారు. పి.బి.సిద్ధార్థా ఆడిటోరియంలో కంఠమనేని రవీంద్రరావు మెమోరియల్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఆదివారం జరిగిన రవీంద్రరావు తృతీయ స్మారకోపన్యాసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రస్తుతం మన దేశంలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, దీనికి మతం, కులం, ప్రాంతం, ఆర్థిక పరిస్ధితులే కారణమని జాస్తి చలమేశ్వర్ అన్నారు. దేశంలో వారసత్వ పరిపాలన ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉందో అందరికీ తెలుసని, కానీ జడ్జిని అయిన మరునాడే ఆ పార్టీతో అనుబంధాన్ని వదులుకున్నానని ఆయన గుర్తు చేశారు. తాను జడ్జి పదవిలోకి వచ్చే సమయంలో ఆ విధంగా డిక్లరేషన్ ఇచ్చానన్నారు.
కంఠమనేని రవీంద్రరావు మంచి వ్యక్తిత్వం, నిబద్ధత కలిగినవారని ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ కొనియాడారు. అలాగే భిన్నమైన ఆభిప్రాయాలను స్వాగతించి చర్చించే పట్టణం విజయవాడని అన్నారు. దేశం, సంఘం జీవన విధానాన్నిరాజ్యాంగం తెలియజేస్తుందని తెలిపారు. మాజీ న్యాయమూర్తి సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, బార్ అసోసియేషన్ అద్యక్షులు సోము కృష్ణమూర్తి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రేశ్వరరావు తదిదరులతో పాటు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.