టాలీవుడ్తో తెగని పంచాయతీ: అర్జున ఫల్గుణలో గ్రామ వలంటీర్లను కించపరిచే డైలాగ్: వైసీపీ క్యాడర్ భగ్గు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- తెలుగు చలన చిత్ర పరిశ్రమ మధ్య నెలకొన్న వివాదం ఎంతకూ తెగట్లేదు. ఆన్లైన్ టికెట్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం, బెనిఫిటో షోలను రద్దు చేయడంతో మొదలైన ఈ వివాదం రోజురోజుకూ రాజుకుంటోందే తప్ప తగ్గట్లేదు. ప్రభుత్వ పెద్దలు, సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. టికెట్ల వ్యవస్థను హీరో నాని బహిరంగంగా తప్పు పట్టారు.
కరోనా బారిన పడ్డ వడివేలు: రోజురోజుకూ క్షీణిస్తోన్న పరిస్థితులు: థర్డ్వేవ్ సంకేతాలు
ప్రభుత్వంపై సెటైరికల్ డైలాగ్స్..
తమిళనటుడు సిద్ధార్థ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. కొందరు నిర్మాతలు సైతం ఆ విధానంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. దగ్గుబాటి సురేష్బాబు, దిల్ రాజు వంటి బడా ప్రొడ్యూసర్లు జగన్ సర్కార్తో ఘర్షణ వైఖరికి దిగిన సందర్భాలు లేకపోలేదు. ఇదంతా ఒక ఎత్తయితే- తెలుగు సినిమాల్లోనూ జగన్ సర్కార్కు చురకలు అంటించే డైలాగ్స్ పడుతున్నాయి. ఈ వ్యవహారం.. ప్రభుత్వానికి-ఫిల్మ్ ఇండస్ట్రీకి మధ్య దూరాన్ని మరింత పెంచడానికి కారణమౌతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
31న అర్జున ఫల్గుణ
ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న అర్జున ఫల్గుణ మూవీలోనూ అలాంటి డైలాగ్ వినిపించింది. శ్రీవిష్ణు, అమృత అయ్యర్ జంటగా నటించిన సినిమా ఇది. గౌరవ్ పరేఖ్, నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇదో థ్రిల్లర్ మూవీ. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. తేజ మర్ని దర్శకుడు. సుధీర్ వర్మ మాటలు అందించారు.
వలంటీర్లపై
ఈ మూవీ ట్రైలర్ ఈ ఉదయం విడుదలైంది. అందులో వినిపించిన ఓ డైలాగ్.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గ్రామ వలంటీర్ వ్యవస్థపై విసిరిన సెటైరికల్ డైలాగ్ అది. వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమౌతోంది. తనకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందంతో హీరోయిన్ క్యారెక్టర్.. ఆనందంతో బాజా భజంత్రీల మధ్య స్టెప్స్ వేస్తోండగా.. ఇంతకీ ఏం ఉద్యోగం.. అనే డైలాగ్ వినిపిస్తుంది. దీనికి హీరోయిన్.. గ్రామ వలంటీర్ అంటూ చెబుతుంది.
ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులు ఇస్తారు.. అదా
దీనితో అక్కడే ఉన్న హీరో క్యారెక్టర్ శ్రీవిష్ణు.. జోక్యం చేసుకుని- ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులు ఇస్తారు.. అదా అంటూ ప్రశ్నిస్తాడు. దీనికి హీరోయిన అవునంటూ సమాధానం ఇస్తుంది. అయిదు సెకెన్లపాటు నిడివి ఉన్న ఈ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంటింటికీ వెళ్లి కోటా సరుకులు ఇచ్చే ఉద్యోగం..అంటూ గ్రామ వలంటీర్ల వ్యవస్థను తేలిగ్గా తీసుకోవడం పట్ల వైసీపీ అభిమానులు మండిపడుతున్నారు.
అత్యుత్తమ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలా?
పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన అత్యుత్తమ వ్యవస్థను కించపరచడ సరికాదంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. అతి తక్కువ సమయంలో, ప్రజలకు అవసరమైన సేవలను అందించాలనే సత్సంకల్పంతో ఈ వ్యవస్థను రూపొందించిందని గుర్తు చేస్తోన్నారు. లక్షలాదిమంది నిరుద్యోగ యువతకు వారు ఉన్న గ్రామం/వార్డులోనే ఉద్యోగాలను కల్పించిందని చెబుతున్నారు.
ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దంటూ..
అలాంటి వలంటీర్ వ్యవస్థను కించపరచడం తగదని అంటున్నారు. వలంటీర్ల గురించి గ్రామాల్లోకి వెళ్లి ఎవరినయినా అడగాలని, కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలోనూ సేవలను అందించారని స్పష్టం చేస్తోన్నారు. ఈ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం, పొరుగు రాష్ట్రాలు ప్రశంసించాయని చెబుతున్నారు. శ్రీవిష్ణు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, స్వతహాగా కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన నటుడని, ఇలాంటి డైలాగులతో ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.