రాజంపేట ఎంపీ సీటులో తాజా లెక్కలేంటి ? గతానికీ ఇప్పటికీ మారిన సీన్..!
ఏపీలోని రాయలసీమలో దాదాపు ఏకపక్షంగా ఎన్నికలు సాగిపోయే లోక్ సభ సీట్లలో రాజంపేట కూడా ఒకటి. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ సీటు వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి మొగ్గింది. దీంతో వరుసగా రెండుసార్లు రాజంపేట నుంచి ఎంపీగా గెలిచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు పీవీ మిథున్ రెడ్డి హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఈ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
రాజంపేట లోక్ సభ సీటు పరిధిలోకి రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. ఇందులో పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంచుకోట. దీంతో పాటు ఆయన సోదరుడు ద్వారకానాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న తంబళ్లపల్లెను ఈ ఐదేళ్లలో పెద్దిరెడ్డి కుటుంబం కంచుకోటగా మార్చుకుంది. వీటితో పాటు ఉమ్మడి కడప జిల్లా పరిధిలోకి వచ్చే రాజంపేట, కోడూరు, రాయచోటి సీట్లలో వైసీపీ హవా ఎప్పుడూ ఉంటుంది. ఈసారి కూడా ఇందుకు మినహాయింపేమీ లేదు.

అయితే ఎటొచ్చీ పీలేరు, మదనపల్లె సెగ్మెంట్లలో పరిణామాలు తాజాగా మారినట్లు తెలుస్తోంది. రాజంపేట లోక్ సభ సీటులో మిథున్ రెడ్డిపై పోటీగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబానికీ, ఆయనకూ మధ్య మాటల యుద్దం సాగుతోంది. అలాగే గతంలో కిరణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన పీలేరులో మరోసారి ఆయన సోదరుడు, టీడీపీ నేత కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే మరో వైసీపీ సిట్టింగ్ సీటు మదనపల్లెలో టీడీపీ నుంచి మాజీ కాంగ్రెస్ నేత షాజహాన్ బాషా పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున నిస్సార్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. ఈ రెండు సీట్లలోనూ జనసేన పొత్తు కారణంగా టీడీపీ అభ్యర్ధులు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications