ఫలితాలు: రైలు కిందపడి ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
హైదరాబాద్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో పాస్ కాలేదని మనస్తాపానికి గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఓ విద్యార్ధి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గజపతి నగరం రైల్వే స్టేషన్ కాలనీకి చెందిన ఎల్. రవి కుమార్ అనే విద్యార్ధి ఇంటర్ మొదటి సంవత్సరంలో పాస్ కాలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.
గురువారం సాయంత్రం పరీక్ష ఫలితాలను తెలుసుకున్న తర్వాత రవికుమార్ ఇంటికి రాకుండా ఎటో వెళ్లిపోయాడు. తన వద్ద ఉన్న సెల్ ఫోన్ కూడా స్విచ్ చేయడంతో తల్లి దండ్రులు, బంధువులు రాత్రంతా చుట్టు పక్కల పరిసరాల్లో గాలించారు.
శుక్రవారం ఉదయం మరుపల్లి సమీపంలో రైలు పట్టాలపై రవికుమార్ మృతదేహాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించడానికి సమీప ఆసుపత్రికి తరలించారు.
తల్లిదండ్రులపై అలిగి యువకుడి ఆత్మహత్య
తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమారుడు చివరకు మృతదేహామై కనిపించాడు. ఈ సంఘటన సత్తెనపల్లి మండలంలోని ధూళిపాళ్ళ చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పొలాల్లో పని చేస్తున్న కొందరు కూలీలు గురువారం తాగునీటి కోసం పొలంలో నేల బావి వద్దుకు వచ్చారు.
నీటిలో బోర్లాపడి ఉన్నమృతదేహాన్ని గమనించిన తోటి కూలీలకు సమాచారం చెప్పారు. మృతదేహాన్ని వెల్లికిలా తిప్పగా కంకణాలపల్లికి చెందిన ఇరుకులపాటి వెంకటేశ్వరరావు (21) అనే యువకుడి మృతదేహంగా గుర్తించారు. ఈ విషయం ఆ నోటో ఈ నోటా పాకి చివరకు తల్లిదండ్రులు కిష్టయ్య, లక్ష్మీలకు తెలిసింది.
దీంతో ఘటనా స్థలానికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటేశ్వరరావు ఈనెల 21న తల్లిదండ్రులతో గొడవపడి ఇంటినుంచి వెళ్ళాడు. అలిగి వెళ్ళిన తమ కుమారుడు ధూళిపాళ్ళలోని బంధువుల ఇంటివద్ద ఉన్నాడని తల్లిదండ్రులు భావించారు. అయితే ఇలా ఆత్మహత్య చేసుకొవడంతో ఆ ఊరిలో విషాదఛాయలు అలుముకొన్నాయి.