సస్పెన్షన్ పై భగ్గుమన్న ఏబీ-జగన్, శ్రీలక్ష్మిపై కేసుల్లేవా ? కోడికత్తి తర్వాత ఆ పనిచేసినందుకే!
ఏపీలో టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. తనను రెండోసారి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఛార్జిషీటే నమోదు కాని కేసులో తాను సాక్ష్యుల్ని ఎలా ప్రభావితం చేస్తానని ప్రశ్నించారు. కేసులున్నాయనే కారణంతో సస్పెండ్ చేస్తారా అలా అయితే జగన్, శ్రీలక్ష్మి కేసుల సంగతేంటని నిలదీశారు.
సస్పెన్షన్ జీవో ఏదీ?
తనను రెండోసారి సస్పెండ్ చేసూ సీఎస్ సమీర్ శర్మ జీవో జారీ చేసినట్లు వచ్చిన వార్తలపై సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో స్పందించారు. జీవో ఇంకా తన చేతికి ఇవ్వలేదన్నారు. సోషల్ మీడియాలో మాత్రమే చూసానన్నారు. ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవం.ఏడాదిన్నర క్రితం కేసు పెట్టినా ఇంతవరకూ చార్జిషీట్ వేయలేదన్నారు. అసలు ట్రయల్ లేకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తానని ఆయన ప్రశ్నించారు.
ఏ తీసేసిన సలహాదారు సలహానో?
తనను రెండోసారి సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు .ఈ సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో,పనికిమాలిన సలహాదారు ఇచ్చారో అని వ్యంగంగా ప్రశ్నించారు. ఒకసారి హై కోర్టు కొట్టేసినప్పుదు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. గతంలో హైకోర్టు ఇదే సెక్షన్ కింద నమోదు చేసిన కేసును కొట్టేసిందని ఆయన గుర్తుచేశారు.
జగన్, శ్రీలక్ష్మిపై ఛార్జిషీట్ లు లేవా?
సీఎం జగన్ పై 12 సీబీఐ, 6 ఈడీ కేసుల్లో చార్జిషీట్ లు ఉన్నాయని ఏబీ వెంకటేశ్వరరావు గుర్తుచేశారు. శ్రీలక్ష్మి గారిపైనా చార్జిషీట్ లు ఉన్నాయన్నారు. శ్రీలక్ష్మి గారికి వర్తించని నిబంధనలు నాకు ఎలా వర్తిస్తాయని ఏబీ ప్రశ్నించారు. ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతి వాక్యం తప్పని తాను నిరూపిస్తానని ఏబీ తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇజ్రాయెల్ వాళ్లకు రెండు లెటర్ లు రాశారు.అవినీతి నిరోధక చట్టాలకు లోబడి పనిచేస్తామని చెప్పారు. ఇలాంటి వ్యక్తుల వల్ల వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుందని ఏబీ విమర్శించారు.
అందుకే టార్గెట్ చేశారన్న ఏబీ
కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు తను టార్గెట్ చేసాయని ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. కోడికత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చుస్తే గంటల్లోనే అడ్డుకున్నానని ఏబీ గుర్తుచేశారు. ఎన్నో వెధవ పనులు అడ్డుకున్నందుకే తనను టార్గెట్ చేశారన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతా అని రాజభవన్ గేటు ముందు నేను కామెంట్ చేశానా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తానన్నారు. సమాజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్నానన్నారు. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసెే కంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఒక కవి అన్నాడంటూ జగన్ సర్కార్ కు ఏబీ చురకలు అంటించారు.