డ్రోన్ కెమెరాలపై షాకింగ్ వివరణ ఇచ్చిన ప్రభుత్వం..! నేడు కాదు, మూడు రోజులుగా వాడుతున్నాం..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. చంద్రబాబు నివాసంలోకి వదర నీరు వచ్చిందంటూ వైసీపీ నేతలు..చంద్రబాబు భద్రతకు ముప్పు కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ టీడీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్ కెమేరాల వినియోగం పైన రచ్చ జరిగింది. టీడీపీ నేతలు డ్రోన్ కెమేరాల వినియోగం పైన ఆందోళనకు దిగారు.
ఇదే సమయంలో జలవనరుల శాఖ తాము డ్రోన్ కెమేరాలను వినియోగించామని వివరణ ఇచ్చింది. వరద నీటి తీవ్రత తెలుసుకొనేందకే డ్రోన్ వినియోగించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ డ్రోన్ల వ్యవహారం రాజకీయ రంగు పులముకోవటంతో మంత్రి అనిల్ రంగంలోకి వచ్చారు. ఆయన జరిగిన విషయం పైన ఏ జరిగిందనేది తేల్చి చెప్పారు. డ్రోన్లు ఈ రోజు కాదని..మూడు రోజుల నుండి వినియోగిస్తామంటూ కుండ బద్దలు కొట్టారు. డ్రోన్ల సాయంతో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని..దీని వలన చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

మూడు రోజులుగా డ్రోన్లు వినియోగిస్తున్నాం..
డ్రోన్ కెమేరా వినియోగం వివాదం పైన మంత్రి అనిల్ స్పందించారు. రాజకీయ పబ్బంకోసం చంద్రబాబు.. టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారు అంటూ మంత్రి ఫైర్ అయ్యారు. వరద పరిస్థితిపై అంచనాకోసం డ్రోన్లను వినియోగిస్తున్నాం అని మంత్రి తేల్చి చెప్పారు. గత 3 రోజులుగా డ్రోన్లను వినియోగిస్తూనే ఉన్నామని కుండబద్దలు కొట్టారు. ఇరిగేషన్ శాఖ అనుమతి..ఆదేశాలతోనే డ్రోన్ల వినియోగం జరిగిందని మంత్రి స్పష్టం చేసారు. ప్రకాశం బ్యారేజీకి మరింతగా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని.. దాదాపు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. గంటగంటకూ నీటిమట్టం పెరుగుతోందని వివరించారు.
ఎగువనుంచి వచ్చే వరద వల్ల కరకట్టవెంబడి కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు మంత్రి అనిల్. ముంపు ప్రాంతాల్లోని ప్రజల రక్షణ ప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పుకొచ్చారు. డ్రోన్ల సాయంతో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని..రాజకీయ పబ్బంకోసం చంద్రబాబు.. టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మంత్రి అనిల్ ఫైర్ అయ్యారు. కరకట్టమీద ఉన్న ఇల్లు నాది కాదని చంద్రబాబు అన్నారని..ఇదే విషయాన్ని లింగమనేని రమేష్ కూడా చెప్పారని మంత్రి గుర్తు చేసారు. అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని మంత్రి ప్రశ్నించారు.

చంద్రబాబు నివాసం ప్రైవేటు ఆస్థి కాదు..
తాను ఉంటున్న నివాసం ప్రైవేటు ప్రాపర్టీ కాదని గతంలోనే చంద్రబాబు చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేసారు. ఆ ఇల్లు మునిగిపోతుందన్న విషయం బయట ప్రపంచానికి తెలియనీయకూడదని చంద్రబాబు ఆరాటపడుతున్నారని విమర్శించారు. తానుచేసిన తప్పుడు పనులు ప్రజలకు తెలియనీయకుండా చంద్రబాబు అడ్డుకోవడటం సరి కాదని ధ్వజమెత్తారు. వరద వస్తే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని ఎప్పుడో చెప్పామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు ఇసుకబస్తాలు వేసి ఆనీరు పూర్తిగా ఇంటిలోకి రానీయకుండా అష్టకష్టాలు పడుతున్నారని ఎద్దేవా చేసారు.

మంత్రి అనిల్ నిలదీసారు
గతంలో ఆ ఇల్లు నాది కాదు అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నాదే అని ఎలా అంటున్నారని మంత్రి అనిల్ నిలదీసారు. 5 ఏళ్లలో వర్షాలు పడకపోవడంతో, ప్రకాశం బ్యారేజీకి నీరు రాకపోవడంతో చంద్రబాబు ఇల్లు మునగలేదని.. 5 ఏళ్లలో వరద వచ్చి ఉంటే...తన ఇల్లు మునిగిపోకుండా రైతులకు నీరు ఇవ్వడం మాని..చంద్రబాబు గేట్లు ఎత్తివేయించేవారని దుయ్యబట్టారు. ఇకనైనా డ్రామాలు ఆపాలని.. ప్రభుత్వ విధులను అడ్డుకోవద్దని మంత్రి అనిల్ టీడీపీ నేతలకు సూచించారు.












Click it and Unblock the Notifications