కరోనా విషయంలో హైదరాబాద్ కంటే ఏపీ సేఫ్ జోనా ? ఏపీ తెలంగాణా బోర్డర్ లో ట్రాఫిక్ రద్దీతో చర్చ
తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా విషయంలో సేఫెస్ట్ జోనా ? ఏపీలో అత్యధికంగా టెస్టులు చేయడం, జోన్ల వారీగా కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవడంతో తెలంగాణలో ఉన్నసెటిలర్స్ ఇప్పుడు ఏపి వైపు పరుగులు పెడుతున్నారా ?ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో సీఎం కెసిఆర్ మౌనంగా ఉండటం కూడా హైదరాబాద్ కంటే ఏపీ బెస్ట్ అన్న భావన కు కారణం అవుతుందా ? అన్న ప్రశ్నలు తెలంగాణ ఏపీ సరిహద్దు వద్ద తెలంగాణ నుండి ఏపీకి వెళ్లడానికి విపరీతంగా ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి.
ప్రతి రోజు వేల సంఖ్యలో ఏపీకి ప్రజలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేయడంతో హైదరాబాద్ లోని సెటిలర్స్ ఏపీ బాట పట్టిన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా ఏపీ బోర్డర్ చెక్ పోస్టుల వద్ద నెలకొన్న రద్దీ ఏ మాత్రం తగ్గటం లేదు. రోజుకు వేల సంఖ్యలో వాహనాలు చెక్ పోస్టుల వద్ద దర్శనమిస్తున్నాయి.గరికపాడు చెక్ పోస్ట్ వద్ద మొన్నటివరకూ 500 నుండి 700 మంది వస్తున్నారని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 1000కి చేరుకున్నట్లుగా అంచనా.
పాసులు తప్పనిసరి అన్నా సరే పాసుల్లేకుండా ..బోర్డర్ లో ట్రాఫిక్
తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్డౌన్ విషయంలో వ్యవహరిస్తున్న నేపధ్యంలో హైదరాబాద్ లో లాక్ డౌన్ విధిస్తారా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. ఇక దీంతో తండోపతండాలుగా ఏపీ వెళ్లేందుకు క్యూ కట్టారు వాహనదారులు. స్పందన యాప్ ద్వారా అప్లై చేసుకుని ఈపాస్ ఉన్నవారికే, ఏపీలో ధర్మల్ స్క్రీనింగ్, వివరాల నమోదు చేసుకున్న తర్వాత అనుమతిస్తామని అధికారులు చెప్తున్నా అవేవీ పట్టనట్టుగా ఎలాంటి అనుమతులు లేకుండా చెక్ పోస్టుల వద్ద క్యూ కట్టడం వాహనదారులకు పరిపాటిగా మారింది. దీంతో తెలంగాణ ఏపీ బోర్డర్స్ వద్ద మళ్లీ విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది.
తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తే బోర్డర్ లో పరిస్థితి మారుతుందా ?
అనుమతులు లేకుండా ఏపీ లోకి ఎంటర్ అవడానికి వెళ్లిన వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది.తెలంగాణ రాష్ట్రంలో కరోనా విషయంలో నెలకొన్న సందిగ్ధతకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఏపీ చెక్ పోస్టుల వద్ద పరిస్థితి మారే అవకాశం ఉంది. ఒకవేళ లాక్ డౌన్ విధించినా హైదరాబాద్లోని సెటిలర్స్ ప్రయాణాలకు చెక్ పడుతుంది. లాక్ డౌన్ విధించడం లేదు అని ప్రకటించినా హైదరాబాదులో ఉన్న వారు ఊపిరి పీల్చుకునే వెసులుబాటు ఉంటుంది.
కరోనా విషయంలో తెలంగాణా కంటే ఏపీ సేఫెస్ట్ జోన్
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఎలాంటి స్టెప్పు వేయని పరిస్థితిలోనే ఏపీకి వాహనాలు బారులు తీరుతున్నాయి. ప్రజలు హైదరాబాద్ కంటే ఏపీ సేఫెస్ట్ జోన్ గా ఫీల్ అవుతున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గరికపాడు చెక్ పోస్ట్, తిరువూరు చెక్ పోస్ట్, వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద ఏపీ లోకి ఎంట్రీ కోసం భారీగా వాహనాలు క్యూ కడుతున్న తీరు కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండటం కంటే, ఏపీ ఉండటమే బెస్ట్ అని భావిస్తున్నట్లుగా అర్థమవుతుంది.
అధికారులను పరేషాన్ చేస్తూ వారు ఇబ్బందిపడుతున్న వాహనదారులు
కొందరు స్పందన యాప్ ద్వారా ఈపాస్ లకు అప్లై చేసుకుని ఏపీకి వెళుతుంటే, మరికొందరు పాస్ లు లేకుండా బోర్డర్ లలో అధికారులను పరేషాన్ చేస్తున్నారు. వారు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ పరిస్థితి మారాలంటే సీఎం కేసీఆర్ నోరు విప్పాలి. హైదరాబాద్ లో కరోనా కంట్రోల్ కోసం ఆయన ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే, అంత జాతీయ రహదారి మీద రద్దీని తగ్గించిన వారవుతారనే భావన వ్యక్తమవుతోంది.