టీడీపీలోకి బైరెడ్డి చేరిక సందేహమేనా? అడ్డుకుంటున్న టీడీపీ బృందం?
బైరెడ్డి రాజశేఖర్రెడ్డి టీడీపీలో చేరడం సస్పెన్స్గా మారింది. నిజానికి బైరెడ్డి చేరికపై ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకులతో చర్చలు కూడా జరిగాయి.
కర్నూలు: రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) పార్టీని ఈ నెల 5న రద్దు చేసిన బైరెడ్డి రాజశేఖర్రెడ్డి టీడీపీలో చేరడం సస్పెన్స్గా మారింది. ఆయన ఆ పార్టీలోకి వెళ్లడం గురిం చి ఇప్పటికే టీడీపీ ముఖ్య నాయకులతో చర్చలు జరిగాయని సమాచారం.
అయితే జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలక నాయకులు ఆయన రాకను అడ్డుకుంటుండడం వల్లే టీడీపీలోకి బైరెడ్డి ఎంట్రీ సస్పెన్స్గా మారిందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. అదే నియోజకవర్గం నుంచి ఆయన సామాజికవర్గానికి చెందిన వైసీపీ కీలక నాయకుడిని టీడీపీలోకి తెచ్చేందుకు అధి నాయకత్వం నుంచే ఓ బృందం రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.
జిల్లా నాయకులతో సంబంధం లేకుండానే ఆ బృందం వైసీపీ నాయకులకు గాలం వేస్తున్నట్లు సమాచారం. అందువల్లే బైరెడ్డి ఎంట్రీకి బ్రేకులు పడ్డాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.
అయితే జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు జిల్లాకు రానున్నారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవా, కేసీ కాల్వలకు కృష్ణాజలాలు ఎత్తిపోసే పంపులను ప్రారంభిస్తారు.
ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమమే అయినా.. బైరెడ్డి రాయలసీమ పరిరక్షణ సమితిని రద్దు చేసి టీడీపీలో చేరనున్నారనే ప్రచారం నేపథ్యంలో సీఎం జిల్లా పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతోపాటు నంద్యాల ఉప ఎన్నిక తరువాత ఆయన జిల్లాకు వస్తున్నారు.