రాజకీయం: చంద్రబాబు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా?
హైదరాబాద్: పార్టీ నాయకుల మధ్య సమన్వయం సాధించి, సరైన జట్టును ఎంపిక చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నారనే మాట వినిపిస్తోంది. విశేష రాజకీయానుభవం ఉన్న ఆయన నాయకుల మధ్య ఐక్యత సాధించడంలో విఫలమవుతున్నారని అంటున్నారు. వాడుకుని వదిలేశాడనే వ్యాఖ్యలు చంద్రబాబుపై చాలా మంది నుంచి వచ్చాయి.
చంద్రబాబు వ్యాఖ్యలు: పొరపాటా, గ్రహపాటా?
చంద్రబాబుతో ఇమడలేక వెళ్లిపోయినవారూ ఉన్నారు. పార్టీలో ఎప్పటికప్పుడు అంతర్గత తగాదాలు పొడసూపుతూనే ఉన్నాయి. ఎన్టీ రామారావు నుంచి ప్రభుత్వాన్ని, పార్టీని సొంతం చేసుకున్నప్పుడు చంద్రబాబుతో ఉన్న నాయకులు చాలా మంది ఇప్పుడు లేరు.
నిజానికి, కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం సాధించి, వారిని తన వెంట తీసుకుని వెళ్లడంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారనే మాట వినిపిస్తోంది. ఎన్టీఆర్ నుంచి అధికారం చేజిక్కించుకున్నప్పుడు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, బావమరిది నందమూరి హరికృష్ణ ఉన్నారు. ఆ తర్వాత వెళ్లిపోయి వేరే కుంపటి పెట్టుకున్నారు.
Cartoon : TTDP leaders join TRS
తాము పెట్టిన అన్న తెలుగుదేశం పార్టీ క్లిక్ కాకపోవడంతో ఎవరి దారి వారు చూసుకున్నారు. నందమూరి హరికృష్ణ తిరిగి చంద్రబాబు చెంతకు వచ్చారు. కానీ, ఇప్పుడు దూరమయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా దూరమయ్యారు. వీరు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. చంద్రబాబుకు అండదండలు కూడా అందించారు.
వారసత్వ రాజకీయాలను ముందుకు తెస్తూ తన కుమారుడు నారా లోకేష్కు అడ్డం పడుతున్నాడని జూనియర్ ఎన్టీఆర్ను దూరం చేసుకున్నారు. ఇదే క్రమంలో హరికృష్ణ కూడా దూరమయ్యారు. వారిని దూరం పెట్టి నందమూరి బాలకృష్ణను ముందుకు తెచ్చారు. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి శాసనసభ్యుడిగా గెలిచినప్పటికీ అధికార రాజకీయాల జోలికి రావడం లేదు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేడి రాజకుంటుంటే బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. బాలకృష్ణను గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చంద్రబాబు వాడుకోలేదు. పూర్తిగా నారా లోకేష్కు వదిలేశారు. నారా లోకేష్ కూడా మామ బాలకృష్ణ చేత ప్రచారం చేయించిన దాఖలాలు లేవు. ఎక్కడ ఎవరు ఉపయోగపడుతారు, ఎవరిని ఎలా వాడుకోవాలి, విభేదాలను రూపుమాపుతూ కుటుంబడ సభ్యుల మధ్య గానీ పార్టీ నాయకుల మధ్య సమన్వయం ఎలా సాధించాలి అనే విషయాలను పట్టించుకుని చంద్రబాబు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది.
ఆ కారణంగానే తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సమస్యలు ఎదరువుతున్నాయని అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ను ఎదుర్కోవడానికి తనకు ధీటైన కుడి భుజమో, ఎడమ భుజమో చంద్రబాబుకు లేకుండా పోయిందని చెబుతున్నారు.