ఆపరేషన్ ముద్రగడ: చంద్రబాబు 'కాపు' టార్గెట్?
అమరావతి: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తన భార్యతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాపులను బీసీల్లో చేర్చాలంటే నిరాహారదీక్ష చేపట్టిన ముద్రగడ డిమాండ్లను పరిష్కరిస్తామని దీక్షను విరమింపజేసింది.
ముద్రగడ డిమాండ్లలో భాగంగా కాపు రిజర్వేషన్లపై కమిటీ వేసి తొమ్మిది నెలల్లో రావాల్సిన నివేదిక ఏడు నెలల్లోనే వచ్చేలా చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా వెయ్యి కోట్లు కాపు కార్పోరేషన్కు కేటాయిస్తామని చెప్పడంతో ముద్రగడ ఆమరణ దీక్షను విరమించిన సంగతి తెలిసిందే.
Also Read: రివర్స్: చంద్రబాబు ఎదురుదాడితో ఆత్మరక్షణలో జగన్
కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వ పరిణామాలను చూస్తుంటే ఆ హామీల దిశగా ముందుకు వెళ్తున్నట్లు కనిపించడం లేదు. ఏడు నెల్లలోగా జస్టిస్ మంజునాథ కమిటీ నివేదిక రాకపోతే చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు కాబట్టి మళ్లీ రొడ్డెక్కడం ఖాయం. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ 'ఆపరేషన్ ముద్రగడ' ప్రారంభించినట్టుగా సమాచారం.
నిజానికి ముద్రగడ ఆమరణ దీక్ష తర్వాత రాష్ట్రంలోని కాపులంతా ముద్రగడను తమ ఏకైక నేతగా భావిస్తున్నారు. ఆపరేషన్ ముద్రగడలో భాగంగా ముందు ఆయన ప్రతిష్టను దెబ్బతీసి, బలహీన పరచడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందంటున్నారు.
ముద్రగడ దీక్ష విరమించిన తర్వాత ఆయనపై ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బుడేటి బుజ్జి ఆయనపై తీవ్రవిమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముద్రగడపై మండిపడ్డారు. చంద్రబాబు సమక్షంలోని ముద్రగడ ఒక్కడే కాపులకు నాయకుడా అని బుడేటి బుజ్జి ప్రశ్నించారు.
ఈ రోజు కార్టూన్
కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో ముద్రగడ సాధించింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన అట్టర్ ఫ్లాపయ్యారని అన్నారు. ఆఖరికి టిడిని ప్రభుత్వం చెప్పిందే జరిగిందని అన్నారు. తుని ఘటనలో ఏ1 ముద్దాయి ముద్రగడేనని తేల్చేశారు. కులరాజకీయాలు మానుకోవాలని ముద్రగడకు సూచించారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే బుడేటి బుజ్జితో పాటు టీడీపీ నేతలు కొందరు మద్రగడపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మంజునాథ కమిటీ వచ్చేలోగా ముద్రగడను సాధ్యమైనంత బలహీన పరచాలనేది టీడీపీ ఎత్తుగడగా భావిస్తున్నారు. అంతేకాదు ముద్రగడకు వ్యక్తిగత రాజకీయాలు అంటగట్టి కాపుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే గనుక జరిగితే కాపులకు ముద్రగడ నాయకుడన్న భావనను తొలగిపోతుంది.