'బాబు హోదా అడగలేదని మాతో చెప్పిస్తారా', చిల్లర రాజకీయమని తీవ్ర వ్యాఖ్య
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని ఏపీ బీజేపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ శుక్రవారం నాడు అభిప్రాయపడ్డారు. ఏపీ బీజేపీ నేతలతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ తమకు ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రమని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు రాజకీయ కోణంలో ఆలోచించి ప్రత్యేక హోదా పైన ప్రయివేటు మెంబర్ బిల్లు పెట్టారన్నారు. ప్రయివేటు బిల్లు అంటేనే రాజకీయాలకు సంబంధించిన బిల్లు అన్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కచ్చితంగా సాయపడుతుందన్నారు.
ఏపీని ప్రత్యేక తరగతి రాష్ట్రంగా కాకుండా ప్రత్యేక రాష్ట్రంగా చూడాలనుకుంటున్నామని చెప్పారు. గత చట్టం ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదని కేంద్రమంత్రి జయంత్ సిన్హా అన్నారని చెప్పారు. కానీ ఆయన మాటలను వక్రీకరించారన్నారు. విభజన చట్టంలో లేకున్నా తాము ప్రత్యేక నిధులు ఇస్తున్నామన్నారు.

ఆర్థిక లోటుకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. 2014-15 కంటే ఈసారి 30 శాతం నిధులు వస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదా అంశానికి ప్రత్యామ్నాయం చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. చట్టంలో ఉన్నవి ఇవ్వాలని చంద్రబాబు చెబుతున్నారని, తాము అవే ఇస్తున్నామన్నారు.
అలాంటప్పుడు మేం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కేంద్ర పథకాలు, సాయం పైన తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. నీతి అయోగ్ ద్వారా ఏపీ విషయంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నామని తెలిపారు.
ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అనేవి భావోద్వేక అంశాలన్నారు. ఈ నెలాఖరున ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో ప్యాకేజీ, హోదాపై మాట్లాడుతామని చెప్పారు. చట్టంలో లేకున్నప్పటికీ రూ.6వేల నాలుగు కోట్లు విడుదల చేశామని చెప్పారు.
బాబు ప్రత్యేక హోదా అడిగారా?: జర్నలిస్టుల ప్రశ్న
చంద్రబాబు ప్రత్యేక హోదా అడగలేదా అని విలేకరులు బీజేపీ ఏపీ ఇంఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ను ప్రశ్నించారు. దానికి ఆయన ఆ మాట నా నోటి ద్వారా ఎందుకు చెప్పిస్తారని ఎదురు ప్రశ్నించారని తెలుస్తోంది. చట్టంలో ఉన్న దానిని అమలు చేయాలని చంద్రబాబు కోరారన్నారు.












Click it and Unblock the Notifications