'నిప్పు' సంగతి తేలుతుంది.. చంద్రబాబు అందుకు సిద్దమేనా?
Recommended Video
అమరావతి: ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోందనన్న గందరగోళం నెలకొంది. ఎవరిది డ్రామా? ఎవరిది చిత్తశుద్ది? అన్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. అయితే ఒక్కటి మాత్రం నిజమంటున్నారు పరిశీలకులు.
అన్ని పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవడం మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి చంద్రబాబుకి మధ్య రోజు రోజుకు శత్రుత్వం పెరగిపోతున్నట్టే కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు నోటి వెంట వచ్చిన కొన్ని వ్యాఖ్యలు కొత్త చర్చను లేవనెత్తేలా చేశాయి.
టీడీపీపై అవినీతి ఆరోపణలు:
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీలు ఏపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సైతం.. నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందన్న సంకేతాలిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంపై అవినీతి కేసులు ఖాయమన్న చర్చ జరుగుతోంది. అయితే అమిత్ షాను ఎదుర్కోవడానికి సీఎం చంద్రబాబు మరో వ్యూహాన్ని తెర పైకి తెచ్చారు.
తిప్పికొట్టడానికేనా?:
అవినీతిపై విచారణకు తాము సిద్దమేనని.. కానీ అమిత్ షా కొడుకు మాటేంటి? అని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ముందు ఆయన కొడుకు అవినీతి లెక్క తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు నీతులు చెప్పే బీజేపీ.. ముందు సొంత పార్టీ నేతల అవినీతి చరిత్రను చదువుకోవాలని ఆయన అంటున్నారు.
అయితే తన కొడుకు, మంత్రి లోకేష్పై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టడానికే.. చంద్రబాబు అమిత్ షా కొడుకుపై విచారణ జరిపించాలన్న వ్యాఖ్యలు చేస్తున్నారని, లేదంటే విచారణను ఎదుర్కొంటామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
బాబు అందుకు సిద్దమేనా?:
చంద్రబాబు అన్నట్టు ఒకవేళ అమిత్ షా కొడుకు విషయంలో గనుక విచారణకు సిద్దమైతే.. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై విచారణకు చంద్రబాబు కూడా సిద్దమేనా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. పోలవరం, పట్టిసీమ, రాజధాని నిధులు, శేఖర్ రెడ్డితో లోకేష్ డీలింగ్.. ఇలా అనేక విషయాల్లో ఆరోపణలు ఉన్నందునా.. చంద్రబాబు వాటన్నింటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారా? అన్న చర్చ జరుగుతోంది.
నిప్పు సంగతి తేలుతుంది?:
నిజంగా చంద్రబాబు నిప్పు లాంటి వాడు.. ఏపీ ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడ్డవాడు అయితే.. విచారణకు ఎందుకు సిద్దపడట్లేదు అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వంపై బురదజల్లే వ్యవహారమే అయితే.. అది కూడా విచారణలో తేలుతుంది కాబట్టి.. టీడీపీపై ప్రజలకు మరింత విశ్వసనీయత పెరిగే అవకాశం ఉంది కాబట్టి.. చంద్రబాబు విచారణకు సిద్దమై తాను నిప్పు అని నిరూపించుకుంటారా?.. లేక కేవలం మేకపోతు గాంభీర్యాన్నే ప్రదర్శిస్తారా? అన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.