జగన్ పై రూటు మార్చిన కాంగ్రెస్ ? పొత్తు కంటే పోరుకే మొగ్గు-కిరణ్ ఎంపికతో సంకేతం!
ఏపీలో ఒకప్పుడు తమ పార్టీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ను సీఎం చేయాలంటూ వచ్చిన డిమాండ్లను చాలా సులువుగా పక్కనబెట్టేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత అసలు సినిమా అర్ధం కావడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కాంగ్రెస్ నియమించిన ఇద్దరు సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డికి జగన్ చుక్కలు చూపించారు. చివరికి 2014 ఎన్నికల్లో విఫలమైనా 2019 నాటికి కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీకి రహస్య మిత్రుడైన చంద్రబాబుకూ అప్పటి వరకూ ఉన్న ఓటు బ్యాంకుల్ని తనవైపు తిప్పేసుకుని 151 సీట్ల రికార్డు సృష్టించారు. ఇప్పుడు మరోసారి జగన్ తో వీలైతే పొత్తు లేదంటే పోరాటం అనేలా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.
కాంగ్రెస్ వర్సెస్ జగన్
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంపీగా 2009 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత ఆయన స్ధానంలో సీఎం కావాలని ఆశించారు. కానీ తొలిసారి ఎంపీ అయిన జగన్ ను వారసత్వంగా సీఎం చేసేందుకు కాంగ్రెస్ అంగీకరించలేదు. ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నా అధిష్టానం నిర్ణయం పేరుతో జగన్ కు పగ్గాలు అప్పగించలేదు.
ఆయన స్ధానంలో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలు అయ్యారు. జగన్ సీబీఐ కేసుల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. ఇందులో కాంగ్రెస్ హస్తం ఉండటంతో జగన్ రగిలిపోయారు. చివరికి 2014 ఎన్నికల నాటికి బెయిల్ పై జైలు నుంచి బయటికి వచ్చినా కాంగ్రెస్ తో వైరం మాత్రం అలాగే ఉండిపోయింది.
కిరణ్ వర్సెస్ జగన్ వార్
కాంగ్రెస్ ను వీడి వైసీపీ స్ధాపించిన జగన్ కు అప్పట్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో బలమైన ప్రత్యర్ధి ఎదురయ్యారు. కిరణ్ హయాంలోనే సీబీఐ కేసుల్లో జైలు పాలైన జగన్.. ఆ తర్వాత తన పార్టీ వైసీపీని ఉపఎన్నికల్లో గెలిపించుకోవడంతో కిరణ్ వర్సెస్ జగన్ వార్ ముదిరింది. జైల్లో ఉంటూనే వైసీపీని బలోపేతం చేసిన జగన్ కిరణ్ కు బలమైన ప్రత్యర్ధిగా మారిపోయారు.
మరోవైపు రాష్ట్రవిభజన వీరిద్దరినీ కుంగదీసింది. అయినా కిరణ్ టీడీపీ పరోక్ష సాయంతో 2014 ఎన్నికల వరకూ ప్రభుత్వాన్ని నడిపించారు. మధ్యలో జగన్ అవిశ్వాస తీర్మానాలు పెట్టించినా ఎదుర్కొన్నారు. తన ఎమ్మెల్యేలను జగన్ చీల్చినా కిరణ్ తట్టుకుని నిలబడ్డారు. దీంతో జగన్ వర్సెస్ కిరణ్ వార్ ఓ రేంజ్ లో సాగింది. 2014లో కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టుకుని దారుణంగా ఓడాక కిరణ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
2019లో రూటు మార్చిన జగన్
2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోరు సాగుతుందని, ఇందులో ఎవరైనా గెలిచే అవకాశం ఉందంటూ ఓ దశలో వెలువడిన అంచనాలతో జగన్ కూడా రూటుమార్చారు. తనను జైలు పాలు చేసిన కాంగ్రెస్ పార్టీని క్షమించేశానని ఓ జాతీయ మీడియా ఇంటర్వూలో వెల్లడించారు. తద్వారా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే అందులో తాను భాగస్వామి అవుతానని చెప్పకనే చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసిరాలేదు. కేంద్రంలో అధికారం మాట అటుంచి అతి తక్కువ సీట్లతో దారుణ పరాభవం ఎదుర్కొంది. దీంతో జగన్ కు కూడా కాంగ్రెస్ కు మద్దతివ్వాల్సిన అవసరం రాలేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో తొలిసారి జగన్ పరోక్షంగా జట్టు కట్టారు.
జగన్ తో పొత్తు కంటే వార్ కే కాంగ్రెస్ మొగ్గు?
2014 ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టి దారుణ పరాజయం పాలయ్యాక కొంతకాలం సైలెంట్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే యాక్టివ్ గా మాత్రం లేరు. కొంతకాలంగా ఏపీసీసీ ఛీఫ్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి.
దీంతో కిరణ్ పీసీసీ ఛీఫ్ అయితే జగన్ కు గట్టి పోటీ ఇవ్వొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే జగన్ తో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాను ఆ పార్టీ లైట్ తీసుకుందా అన్న చర్చ జరుగుతోంది. జగన్ కు పాత ప్రత్యర్ధి అయిన కిరణ్ ను రంగంలోకి దింపడం ద్వారా జగన్ తో పొత్తు లేనట్లేనన్న సంకేతాలు కాంగ్రెస్ ఇస్తోంది. అదే జరిగితే ఎన్నికల నాటికి కేంద్రంలో పరిస్ధితులు మారితే జగన్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.