ఐతే...తెలంగాణాలో "సైకిల్" షెడ్డు కా? లేక కారు గ్యారేజ్ కా?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తెలంగాణాలో తమ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడిన మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాయనడంలో సందేహం లేదు. అయితే అంత కఠిన వాస్తవాన్ని మోత్కుపల్లి ఉన్నట్టుండి...హఠాత్తుగా...ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే ప్రశ్నను కాసేపు పక్కన బెడితే ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవం మాత్రం నూటికి నూరుపాళ్లు ఉందని రాజకీయ అవగాహన ఉన్న ఏ వ్యక్తయినా అర్థం చేసుకోగలడు.
వాస్తవంగా చూస్తే...తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. రాష్ట్రం విడిపోయిన మూడున్నరేళ్లలోపే సైకిల్ ముందుకు దూసుకుపోవడం కాదు కదా కనీసం నడిపించుకొని వెళ్లలేని పరిస్థితి వచ్చేసింది. దిగ్గజాలు అనుకున్నవాళ్లు కూడా ఒక్కొక్కరే సైకిల్ దిగేసి కారెక్కి దూసుకుపోతుంటే ఆ పార్టీ పరిస్థితి అయోమయం కాక మరేముంటుంది?...ఏపీలో ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీలో చేర్చుకుంటున్నట్లే...అచ్చం అక్కడ కూడా...కెసిఆర్ అదే పని చేశారు. వెరసి... తెలంగాణలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని...సైకిల్ ని సరిగ్గా నడిపించే నేతే కరువయ్యాడు.
కెసిఆర్ ఆకర్ష్ తో...కుదేలు...
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కాసినో కూసినో సీట్లను గెలుచుకుని తమకు అక్కడ కూడా ఓటు బ్యాంకు ఉందని నిరూపించుకున్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో కుదేలయింది. టీడీపీ నుంచి ఎన్నికైన 12 మంది ఎమ్మెల్యేలు కారెక్కేశారు. ఒకరేమో రిస్క్ అయినా చేతిని పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఆర్. కృష్ణయ్య అసలు పార్టీని పట్టించుకోరు. ఆయన బీసీ మంత్రం ఆయనదే. అంతే తప్ప ఏరోజూ పార్టీ కార్యాలయానికి రారు.
అవరోహణం...ఇలా...
2014 తెలంగాణా ఎన్నికల్లో మూడో అతిపెద్ద పక్షంగా నిలిచిన టీడీపీ ఆ పార్టీ చరిత్ర, స్థితిని బట్టి చూస్తే చాలా వేగంగానే తన ప్రాభవాన్ని, ప్రాముఖ్యతను కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఓటుకు నోటు కేసుతో ఆ పార్టీ పతనం మరింత వేగం పుంచుకుందనేది కూడా వాస్తవం. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా పార్టీ శాసనసభ్యులందరూ టీఆర్ఎస్ లో చేరిపోయారు. కారణాలేమైనప్పటికి టిడిపిలో నిన్నామొన్నటి దాకా పోరాటం సాగించిన వర్కింగు ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెసులో చేరిపోవడంతో ఆ పార్టీ బలమైన వాయిస్ ను కూడా కోల్పోయింది. మిగిలిన నాయకుల్లో రాష్ట్రస్థాయి ప్రభావం చూపగల స్థాయి వారెవరూ లేరు. ఏ కారణం వలనైతే నేమి ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపికి టీఆర్ఎస్ తో పోరాడేంత శక్తి లేదన్న విషయం గ్రహించే రేవంత్ కాంగ్రెసును తనకు ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకొని జంపయ్యారు.
టిఆర్ఎస్ కు పోటీనా?...అంత సీన్ లేదు...
దీంతో వాస్తవ పరిస్థితి గమనించిన టిడిపి క్రమంగా మానసికంగా టీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించి చర్చలు కూడా సాగుతున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే టీడీపీ బలం బాగా క్షీణించి పోయిందని గ్రహించిన టీఆర్ఎస్ అగ్రనాయకత్వం కనీస స్థాయిలో సీట్లు ఇచ్చేందుకు కూడా ముందుకు రావడం లేదనేది అక్కడి టాక్...
బలుపు కాదు వాపే...
రేవంత్ రెడ్డి నిష్క్రమణ తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఒకానొక సందర్బంలో ఎన్టీయార్ భవన్ ను సందర్శించి తమ పార్టీ క్యాడర్ లో జోష్ తీసుకొచ్చారు. అయితే అది వాపే కానీ బలుపు కాదని ఆ తరువాత పరిణామాలను బట్టి తేలిపోయింది.దాంతో అది మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఆ తర్వాత మళ్లీ టీటీడీపీ వైపు ఆయన తొంగి చూడలేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నరాజకీయ ఒత్తిడులతో చంద్రబాబు కనీస స్థాయిలో కూడా తెలంగాణ వైపు దృష్టి సారించలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రాధాన్యత దానంతటదే తగ్గిపోతూ వచ్చి చివరకు ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ ఉనికికి అర్థం లేదనే వాదన ఊపందుకోవడంతో ఆ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు.
ముందుంది...రెండే ఆప్షన్లు...
ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే తెలంగాణలో తెలుగుదేశం గత వైభవానికి తొందరలోనే తెరపడబోతోందని రాజకీయ ఇంగితజ్ఞానం ఉన్న ఏ వ్యక్తయినా అంచనా వెయ్యగలడు. సో...ఇక ఇప్పుడు టిడిపి ముందున్నది రెండే ఆప్షన్లు. ఒకటి టిఆర్ ఎస్ తో కలిసిపోవడం లేదా పొత్తు కోసం బేరాలాడుకోవడం...అంతకు మించి చెయ్యడానికి మరేమీలేదని ఆ పార్టీ సీనియర్ నేతే స్ఫష్టంగా చెప్పేశారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యునిగా చేసిన టీటీడీపీ అగ్రనేత మోత్కుపల్లి నరసింహులు మాకిక తెలంగాణలో ఛాన్సు లేదని తేల్చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆయన మాటల వెనుక మతలబు ఏంటనేది కొన్ని రోజుల్లోనైనా తేలుతుంది. కాకపోతే ఇక్కడ పాయింటల్లా ఆయన చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమనేదే.
మరైతే టిడిపి భవిష్యత్తు...ఏమిటి?
ఏదేమైనా మోత్కుపల్లి మాటలు తెలంగాణాలో తెలుగుదేశం వర్గాలను మరింత కుంగదీసుంటాయి. మరైతే టిటీడీపీకి భవిష్యత్తు నిజంగా లేదా?టిఆర్ఎస్ లో విలీనమే పరిష్కారమా?...మరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విశ్వసించిన 40 లక్షల ఓటర్లుకు సమాధానం చెప్పే దిక్కెవరు...అన్నీ ప్రశ్నలే...అయితే ఈ ప్రశ్నలకు ఎక్కువకాలం వేచి చూడకుండానే త్వరలోనే సమాధానం లభిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.