అవునా...'ఆంధ్రజ్యోతి' మీద కూడా ఐటి దాడులు జరుగుతాయా?...'ఆర్కే'నే అంటున్నాడు
హైదరాబాద్:ఇన్కం టాక్సు వాళ్లే కాదు...వాళ్ల బాబుని పంపినా తాను భయపడనని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ(ఆర్కే) బిజెపి ఎంపి జివిఎల్ తో సవాల్ చేశారు.
ఏబీఎన్ చానల్లో ప్రసారమైన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో ఎపిలో ఐటీ దాడులకు సంబంధించి జరిగిన చర్చా కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, టిడిపి ఎంపి సిఎం రమేష్, బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు పాల్గొన్నారు.ఈ క్రమంలో వీరి ముగ్గురి మధ్య వాదనల నేపథ్యంలో సిఎం రమేష్ ఆంధ్రజ్యోతిపై ఐటి దాడుల ప్రస్తావన తేగా అందుకు స్పందించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎబిఎన్ ఛానెల్లో 'బిగ్ డిబేట్' చర్చా కార్యక్రమం సందర్భంగా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, టిడిపి ఎంపి సిఎం రమేష్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మధ్య జరిగిన వాదనలు ఇలా ఉన్నాయి. ఆర్కేని ఉద్దేశించి బిజెపి ఎంపి జివిఎల్ మాట్లాడుతూ..." సీఎం రమేశ్ వ్యాపారం అమాంతంగా పెరిగిపోయిందని మీ 'ఆంధ్రజ్యోతి'లోనే రాశారు. నేను రోజూ మీ పేపరు చదువుతాను. ఆంధ్రజ్యోతిలో వచ్చినవి యదార్థమని నమ్ముతాను"...అన్నారు.
ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ పని చూస్తాం
దీనిపై స్పందించిన ఆర్కే..."ఈ మధ్య ఆంధ్రజ్యోతిని మీరెందుకు షీల్డ్గా వాడుకుంటున్నారు?...ఏ రోజు కూడా మేం సీఎం రమేశ్ వ్యాపారం అసాధారణంగా పెరిగిందని రాయలేదు. మీవంటి నేతలు ఆరోపిస్తే వాటినే ప్రచురించాం."...అని బదులిచ్చారు. వీరి వాదన మధ్యలో జోక్యం చేసుకున్న సీఎం రమేశ్..."అదొక్కటే కాదండీ...బీజేపీ వాళ్లు మరొక మాట కూడా చెబుతున్నారు. ‘ఆంధ్రజ్యోతి' రాధాకృష్ణ పని చూస్తాం.. ఆయనపైన ఇన్కంటాక్సు దాడులు చేస్తామని బహిరంగంగా చెబుతున్నారు. నిన్నగాక మొన్న గుజరాత్లో ఒకరికి చూపించాం. మొన్న ఎన్డీటీవీకి చూపించాం. రేపు రాధాకృష్ణకు కూడా చూపిస్తామని చెబుతున్నారు"...అని ఆరోపించారు.
ఎంపి జివిఎల్ నుద్దేశించి
దీనిపై స్పందించిన ఆర్కే బిజెపి ఎంపి జివిఎల్ నుద్దేశించి..."ఏమండీ.. మాపైకి కూడా వస్తున్నారా? ఎప్పుడు వస్తారు? రెడీగా ఉంటా...ఇన్కంటాక్సే కాదు...వాళ్ల బాబునైనా పంపండి...ఏం భయం లేదు. వారితో పాటు మీరు కూడా రండి"...అని వ్యాఖ్యనించారు. అందుకు జీవీఎల్ బదులిస్తూ..."అదేం లేదండీ! ఇలాంటి మాటలు నేనెప్పుడూ చెప్పలేదు. మీలాగే అందరికీ ధైర్యం ఉండాలి...అయినా మేం పంపేదేముంది? ఎవరు వచ్చినా ఇబ్బంది పడాల్సిన, బెంబేలెత్తాల్సిన పని లేదు"..అని బదులిచ్చారు.మళ్లీ ఆర్కే మాట్లాడుతూ...టీడీపీ సంగతి పక్కన పెట్టండి. మనలో మన మాట. ఎంతమంది ఉన్నారు మీ టార్గెట్లో.. హిట్ లిస్ట్లో... అని జివీఎల్ ను వ్యంగ్యంగా అడిగారు.
రమేశ్ చెప్పారని కాదు
అందుకు జివిఎల్ సమాధానంగా..." నా టార్గెట్లో, హిట్ లిస్ట్లో ఎవరూ లేరు. నన్నే అందరూ టార్గెట్ చేసుకుంటున్నారు. అనేకమంది టీడీపీ నాయకులకు సింగిల్ పాయింట్ ఎజెండా. ఏదో ఒకవిధంగా జీవీఎల్పైన పడదాం. ఏదోరకంగా ఆయన్ను దూషిద్దాం. చంద్రబాబుని ఖుష్ చేద్దామని వారికి ఎజెండా ఉంది కానీ నాకు పర్సనల్గా ఎజెండా లేదు"...అని జవాబిచ్చారు. జివిఎల్ సమాధానంపై ఆర్కే మాట్లాడుతూ..."మిమ్మల్ని వ్యక్తిగతంగా అనడం లేదు. మీ పార్టీ హిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నానని...రమేశ్ చెప్పారని కాదు కానీ...బీజేపీలో నాతో సన్నిహితంగా ఉండే వాళ్లు చెప్పారు...మీ మీద మా పార్టీ అగ్రనాయకత్వం చాలా ఆగ్రహంగా ఉంది...ఇబ్బందులు పడడానికి సిద్ధంగా ఉండండని నాతో వాళ్లే చెప్పారు"...అన్నారు.
సిఎం రమేష్ జోక్యం
ఆర్కే మాట్లాడుతుండగా టిడిపి ఎంపి సిఎం రమేష్ జోక్యం చేసుకొని..."తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక చానల్, పత్రికపై దాడులు చేసే అవకాశం ఉందని బీజేపీ వాళ్లు ఓపెన్గా చెబుతున్నారని...అదే విషయం రెండ్రోజుల కింద మీడియాకు చెప్పాను"...అన్నారు. దీంతో రాధాకృష్ణ తన మాటలను కొనసాగిస్తూ..."పడితే పడనివ్వండి. మోస్ట్ వెల్కం. రాజకీయాల్లో నీతి, నిబద్ధత ఉండాలని జీవీఎల్గారు అన్నారు కదా! బీజేపీ హయాంలో సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలను ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారని, యూపీఏ ప్రభుత్వాన్ని మించి చేస్తున్నారన్నది మీరు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణ"...అని ముక్తాయింపు ఇచ్చారు.