ఇండియా, పాకిస్తానా: సచివాలయంలో బారికేడ్లపై బాబు
హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్లు ఏమైనా ఇండియా-పాకిస్థాన్లా? అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సచివాలయంలో బారికేడ్లు ఏమిటని అడిగారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల మధ్య స్పర్థలున్నాయా అని ప్రశ్నించారు. ఇలా బారికేడ్లు వేయడం ఏమిటని నిలదీశారు. విద్యుత్తుపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ఆయన బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) ఆమోదించిన పీపీఏలను తాము గౌరవిస్తామని, ఇప్పటి వరకూ ఆమోదించని పీపీఏలు సహజసిద్ధంగానే రద్దవుతాయని చంద్రబాబు చెప్పారు. పీపీఏలపై కాంగ్రెస్, తెరాసలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. పీపీఏల అంశంపై కేంద్రం కమిటీ వేసిందని, ఇందులో నీరజా ముథాల్, సోని, వైకే సెహగల్, ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి, తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శులతో పాటు ఇతర అధికారులు ఉంటారని చెప్పారు.

అయితే ఈ కమిటీ పీపీఏ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించలేదని, కేవలం సూచనలు మాత్రమే చేయగలదని చంద్రబాబు వివరించారు. గృహావసరాలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలన్న పథకంపై సమీక్షించేందుకు కేంద్ర కమిటీ ఈ నెల 4న రాష్ట్రానికి రానున్నదని చంద్రబాబు వివరించారు. ఇప్పటికే ఈ కమిటీ రాజస్థాన్లోనూ పర్యటించిందని వివరించారు.
విద్యుత్ చార్జీలను పెంచబోమంటూ ప్రజలకు హామీ ఇవ్వగలరా అన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు కాస్త అసహనానికి లోనయ్యారు. ఇలాంటి ప్రశ్నలు వేసే ముందు కాస్త ఆలోచించుకోవాలని సూచించారు. 'ఈ స్థానంలో మీరు కూర్చున్నా (మీడియాను ఉద్దేశించి) చార్జీలు పెంచబోమని చెప్పగలరా?' అని ప్రశ్నించారు. విద్యుత్రంగంపై శ్వేతపత్రం విడుదలపైనే మాట్లాడాలని అనుకున్నానని అయినా మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చంద్రబాబు అన్నారు. అయితే ఇలాంటి అంశాలపై అడిగితే ఎలా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications