విసుగొచ్చింది: టిడిపిపై జూ.ఎన్టీఆర్ది వ్యూహమా, వైరాగ్యమా?
విజయవాడ: తాను తెలుగుదేశం పార్టీతో ఉన్నానా లేదా అనే ప్రశ్నలకు సమాధానం చెప్పీ, చెప్పి విసుగు వస్తోందని నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. తనకు రాజకీయాల కంటడే సినిమాలే మఖ్యమని ఆయన చెప్పారు. జనతా గ్యారేజ్ విడుదల నేపథ్యంలో ఆయన వరుస ఇంటర్వ్యూలో ఇస్తున్నారు.
ఈ సందర్భంగా రాజకీయాల పైన కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తున్నారు. టిడిపితో సన్నిహితంగా ఉన్నానా లేదా అనే విషయమై చెప్పీ చెప్పీ విసుగు వస్తోందని చెప్పారే కానీ, నేరుగా తాను టిడిపితో ఉన్నానా లేదా మాత్రం చెప్పకపోవడం గమనార్హం.
జూనియర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు వారసుడి విషయమై నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి. దీంతో చంద్రబాబుతో విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన టిడిపికి దూరంగా ఉన్నట్లు కనిపించింది.

జూ. ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా వారసత్వం విషయంలో చంద్రబాబుపై పరోక్షంగా, ప్రత్యక్షంగా మండిపడ్డ సందర్భాలున్నాయి. గతంలో ఒకటి రెండుసార్లు టిడిపికి మద్దతిచ్చే విషయమై జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. తాను ఎప్పటికీ తన తాత స్థాపించిన పార్టీలో ఉంటానని చెప్పారు. 2014లో టిడిపి తరఫున ఆయన ప్రచారంపై ఊహాగానాలు వచ్చాయి. కానీ ప్రచారం చేయలేదు.
ఇప్పుడు, జనతా గ్యారేజ్ విడుదల నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలలో ఆయనకు రాజకీయపరమైన ప్రశ్నలు కూడా ఎదురువుతున్నాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తనకు రాజకీయాల కంటే సినిమాలు ముఖ్యమని చెబుతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనని అభిప్రాయపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ వారసత్వ పోరులో చంద్రబాబు పైచేయి సాధించడం, ఆ తర్వాత వరుసగా సినిమాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వరుస హిట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ వైరాగ్యంతో మాట్లాడుతున్నారా లేక వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా అనే చర్చ సాగుతోంది.
ఇటు తెలుగుదేశం పార్టీకి దూరంగా లేనని చెప్పడమా? లేక ఆ పార్టీకి దూరం జరిగానని ఆయన చెబుతున్నారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అలాగే, భవిష్యత్తులో రాజకీయాలకు వచ్చే అంశం పైనా ఆయన ఇప్పుడే తేల్చలేకపోతున్నారు. దీంతో, ఆయన ఎవరినీ దూరం చేసుకోవద్దనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications