కొడాలి చెప్పింది కరెక్ట్ -జగన్ కే అర్ధం కావట్లేదు -రఘురామ కామెంట్స్!
ఏపీ మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టులో ప్రతికూల తీర్పు వెలువడితే బీజేపీపై ఒత్తిడి పెంచి పార్లమెంటులోనే రాజధానుల బిల్లు పెట్టిస్తామంటూ కొడాలి నాని చేసిన కామెంట్స్ ను రఘురామ సమర్ధించారు.
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కీలక దశకు చేరుకుంటోంది. వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లాల్సిన తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వం.. ఆ తర్వాత ఏం చేయాలో కూడా ప్లాన్ బీ రెడీ చేసుకుంటోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ చూస్తే ఇదే అర్ధమవుతుంది. సరిగ్గా ఇదే అంశంపై స్పందించిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొడాలికి అర్ధమైంది, జగన్ కు ఎందుకు అర్ధం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు.
రాజధానులపై సుప్రీంకోర్టు తీర్పు
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీనిపై ఈ నెల 7వ తేదీన తదుపరి విచారణ కూడా ఉంది. అనంతరం దీన్ని సమగ్రంగా పరిశీలించి, వాదోపవాదాలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ ఏడాది తుదితీర్పు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపై ఇటు వైసీపీతో పాటు అటు వ్యతిరేక పక్షాల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.
ఇందులో ఎక్కడైనా తేడా కొడితే ఏం చేయాలనే దానిపైనా ఇప్పటి నుంచే రాజకీయ పక్షాలు ప్రిపేర్ అవుతున్నాయి. లేకుంటే ఎన్నికలకు ముందు భారీ నష్టం తప్పదనే అంచనాల్లో ఉంటున్నాయి. ఇదే అంశంపై తాజాగా వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
కొడాలి నాని చెప్పిందేంటి?
వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తీర్పు ఎలా వస్తుందన్న దాని జోలికి వెళ్లకుండానే.. తీర్పు ప్రతికూలంగా వస్తే ఏం చేస్తామనే దానిపై కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల్ని సుప్రీంకోర్టు వద్దంటే తిరిగి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజధానుల బిల్లు పార్లమెంటులోనే పెట్టిస్తామన్నారు.
అలాగే మూడు రాజధానులకు మద్దతిచ్చే పార్టీలకే కేంద్రంలో వైసీపీ మద్దతిస్తుందని కూడా తేల్చిచెప్పేసారు. దీంతో ఇది కొడాలి అభిప్రాయమా లేక వైసీపీ అభిప్రాయమా అనే చర్చ సాగుతోంది.
కొడాలి వాదన కరెక్ట్ అన్న రఘురామ
సుప్రీంకోర్టు ఏపీలో మూడు రాజధానుల్ని వద్దనే పక్షంలో పార్లమెంట్ లో కేంద్రంతోనే రాజధానుల బిల్లు పెట్టిస్తామంటూ కొడాలి చేసిన వ్యాఖ్యల్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ సమర్ధించారు. పార్లమెంట్ లో చట్టం ద్వారానే రాజధాని మార్పు సాధ్యమనేది మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని గ్రహించారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
ఈ విషయం మిగతా వారికి అర్ధం కావడం లేదన్నారు. తద్వారా వైసీపీ ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్లక తప్పని పరిస్ధితులు రాబోతున్నాయని రఘురామ జోస్యం చెప్పారు.
జగన్ కంటే కొడాలి బెటర్?
సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే రానున్న ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలను, 25 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని కేంద్రంలోని బీజేపీని జుట్టు పట్టుకొని మరీ పార్లమెంట్లో బిల్లు పెట్టించి, విశాఖను రాజధానిగా చేస్తామని కొడాలి నాని చెప్పడాన్ని రఘురామ సమర్ధించారు.
ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యామని చెప్పే వారి కంటే అంత పెద్దగా చదువుకొని కొడాలి నాని... పార్లమెంటులో చట్టం చేయకుండా, ఒకసారి చేసిన చట్టాన్ని కోర్టులు కూడా ఏమి చేయలేవని గ్రహించారని అర్థమవుతుందని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.