ఆ అసెంబ్లీ టికెట్టే కావాలి...వైసిపితో టిడిపి ఎంపి సంప్రదింపులు:ఎవరంటే?
విశాఖపట్టణం:ఆయనో టిడిపి ఎంపి...ఒకప్పుడు మంత్రి గంటా శ్రీనివాసరావుకు సన్నిహితుడు...మరి ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆయనకే పక్కలో బల్లెంలా తయారయ్యాడు...
ఎలాగంటే మంత్రి గంటా ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదే సీటు తాను కోరుకుంటున్నారు. ఒకవేళ టిడిపి నుంచి ఆ స్థానం తనకు దక్కని పక్షంలో పార్టీ మారేందుకు సైతం వెనుకాడటం లేదని తెలుస్తోంది...ఇంతకీ ఆయనెవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది...అవునండీ...ఆయనే...అనకాపల్లి టిడిపి ఎంపి అవంతి శ్రీనివాసరావు...మంత్రి గంటా ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి టికెట్ ఇస్తానంటే వైసిపిలోకి వస్తానని అవంతి వైసిపితో మంతనాలు జరుపుతున్నారనేది లేటెస్ట్ టాక్...వివరాల్లోకి వెళితే...
ముదిరిన...విభేదాలు
విశాఖ జిల్లా టీడీపీలో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటివరకూ మంత్రి అయ్యన్నపాత్రుడు, మరో మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలతో రచ్చకెక్కిన విశాఖ టిడిపి రాజకీయం తాజాగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ గొడవ కూడా వీటికి తోడవడంతో పతాకస్థాయికి చేరినట్లయింది. ఇప్పుడు మంత్రి గంటా శ్రీనివాస్, ఎంపి అవంతి శ్రీనివాస్ మధ్య విభేదాలు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయని స్థానిక టిడిపి శ్రేణుల ద్వారా తెలుస్తోంది.
ఇద్దరూ ఒకేసారి...ఒకేపార్టీ నుంచి
మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ వీరిద్దరూ ఒకేసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి టీడీపీలో చేరారు. ఇటీవలికాలం వరకూ చాలా సఖ్యంగానే మెలిగేవారు. అయితే అనుకోకుండా తలెత్తిన ఇగో క్లాషెస్ వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు పార్టీ శ్రేణుల సమాచారాన్ని బట్టి తెలిసింది. ఆ క్రమంలోనే మే 27 న జరిగిన మంత్రి గంటా ఏర్పాటుచేసిన టిడిపి సమావేశానికి ఎంపి అవంతి శ్రీనివాస్ సమావేశం కొద్దిసేపట్లో ప్రారంభం అవుతుందనగా పిలిచారట. దీంతో రగిలిపోయిన ఎంపి అవంతి తాను కూడా పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అదే రోజు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు మంత్రి గంటాకు పోటీగా అన్నట్లుగా ఎంపి రైల్వే జోన్ కోసం దీక్ష చేపట్టడం వీరి మధ్య విభేదాలను నిర్థారించినట్లయింది.
దానివల్ల ఇదో...దీనివల్ల అదో
అయితే వీరిద్దరి మధ్య విభేదాలకు దారితీసిన కారణమేంటనేది పార్టీ శ్రేణులకు సైతం తెలియకపోయినా భీమిలి అసెంట్లీ సీటు అనేది వీరద్దరి మధ్య రగడ తారాస్థాయికి చేరుకోవడానికి కారణమైందని మాత్రం అంటున్నారు. అనకాపల్లి ఎంపిగా ఉన్న ఎంపి అవంతి ఈసారి భీమిలి అసెంబ్లీ స్థానానికి పోటీచేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. ఎంపి అవంతికి ఈ నియోజకవర్గంతో ఉన్న సంబంధం...2009 ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందటం గమనార్హం. ఈక్రమంలో ఎంపి అవంతి మళ్లీ భీమిలి ఎమ్మెల్యే టికెట్ కోసం చూడటం మంత్రి గంటాకు...ఈయనకు మధ్య విభేదాలకు కారణమైందా? లేక...వీరిద్దరి మధ్య విభేదాల కారణంగానే మంత్రి గంటాకు పోటీగా ఎంపి అవంతి అదే బీమిలి ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటున్నారో తెలియాల్సివుంది.ఈ క్రమంలో ఎంపి అవంతికి సంబంధించి ఆయన అనుచరులు భీమిలి నియోజకవర్గంలో కట్టిన ఫ్లెక్సీలను మంత్రి గంటా అనుచరులు తొలగించడంతో రచ్చ శిఖరాగ్రానికి చేరుకున్నట్లుగా చెబుతున్నారు.
అందుకే...వైసిపితో మంతనాలు
అయితే మంత్రి గంటా మంత్రాంగం దాటి భీమిలి టికెట్ టిడిపి నుంచి తనకు దక్కుతుందా అనే సందేహం ఎంపి అవంతికి ఉందట. దీంతో తనకు భీమిలి టికెట్ ఇస్తానంటే వైసిపిలోకి వచ్చేందుకు సిద్దమేనని ఎంపి అవంతి శ్రీనివాస్ ఆ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారనేది తాజా ప్రచారం. భీమిలి వైసీపీ ప్రధాన కార్యదర్శి జి.వెంకటరెడ్డి ఆ నియోజకవర్గం పార్టీ వాట్సప్ గ్రూప్లో శుక్రవారం పెట్టిన ఒక పోస్టే అందుకు నిదర్శనం అంటున్నారు. ఆయన పోస్టు సారాంశం ఏమిటంటే ఎంపి అవంతి శ్రీనివాసరావు వైసీపీలోకి రాకుండా అడ్డుకోవాలని పార్టీ శ్రేణులను కోరుతున్నట్లు ఉంది. దీన్నిబట్టి ఎంపి అవంతి వైసిపిలోకి రావాలని ప్రయత్నిస్తున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. మరోవైపు ఎంపి అవంతి ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం తనపై జరుగుతున్న కుట్రగా అభివర్ణిస్తున్నారని తెలిసింది. ఏదేమైనా ఇప్పటిదాకా ద్విముఖంగా ఉన్న విశాఖ గ్రూపు రాజకీయాలు ఇప్పుడు త్రిముఖంగా మారడంతో ఇక్కడి పార్టీ పరిస్థితి ఎలా మారుతుందో నని టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.