నిన్న కాళ్లు పట్టుకొని, పవన్ కళ్యాణ్ కూడా కెసిఆర్తో కలిశారా: అంబటి
హైదరాబాద్: అధికారంలోకి వచ్చేందుకు సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకున్న వాళ్లు, ఇప్పుడు ఆయన జుత్తు పట్టుకుంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత అంబటి రాంబాబు గురువారం తెలుగుదేశం పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నేతలకు ఎందుకు కోపం వస్తోందో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసిపోయారని ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అది సరికాదన్నారు.
ఎవరు తిట్టినా వారిని కెసిఆర్తో కుమ్మక్కయ్యారని ఆరోపించడం ఒక్క తెలుగుదేశం పార్టీ నేతలకే చెల్లిందన్నారు. రుణాలు మాఫీ చేయడం మానేసిన ఆంధ్రప్రదేశ్ సర్కరు మాఫియాలా తయారయిందని ఆయన మండిపడ్డారు.
కాగా, సెక్షన్ 8 గురించి, ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. సెక్షన్ 8 అవసరం లేదని వైసీపీ చెప్పింది. అలాగే, ఓటుకు నోటు అంశం తెరపైకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అంటున్నారని మండిపడ్డారు.
వైసీపీ వ్యాఖ్యల పైన టీడీపీ మండిపడింది. జగన్.. కెసిఆర్తో కలిసిపోయారని మండిపడింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెక్షన్ 8 వద్దనటం, ప్రత్యేక హోదా కోసం విమర్శలు చేస్తుండటంతో ఆయన పైనా భగ్గుమన్నారు. దీనిపై అంబటి స్పందించారు.