ఏపీలో పొలిటికల్ హీట్, ఏం జరగనుంది.. ఇంటెలిజెన్స్ ఆరా? కొందరి ప్రయివేటు సర్వే
అమరావతి: ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ అవిశ్వాసం సూచన మొదలు టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడం, జగన్ అవిశ్వాసానికి సిద్ధం కావడం, గుంటూరులో జనసేనాని టీడీపీపై దుమ్మెత్తిపోయడం, అవిశ్వాసంపై టీడీపీ వెంటనే యూటర్న్ తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారిన నేపథ్యంలో ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఎన్డీయేతో తెంచుకోవడం వల్ల టీడీపీకి లాభమా? బీజేపీకి లాభమా? జనసేనాని ఒంటరిగా పోటీ చేస్తారా? జగన్ బీజేపీ దరి చేరుతారా? అనే చర్చ సాగుతోంది. జనంలో చర్చ జరుగుతుండటంతో ఐబీ, ఇంటెలిజెన్స్ పలు అంశాలపై ఆరా తీసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నారు
కేంద్రంపై టీడీపీ, వైసీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? దీని ప్రభావం ఎవరి మీద ఎలా ఉంటుంది? వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిణామం ఎలా ఉంటుంది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారని అంటున్నారు.
లోకేష్ మీద పవన్ వ్యాఖ్యలపై
మంత్రి నారా లోకేష్ అవినీతికి పాల్పడుతున్నారని అందరూ అనుకుంటున్నారని, ఈ విషయం తెలియదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఎవరెవరిలో సానుకూలత వచ్చింది, ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు అనే చర్చ సాగుతోంది. ఇలాంటి అంశాలపై ఆరా తీస్తున్నారట.
పవన్, జగన్ జతకడితే
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందని కొందరు, ఆయన హఠాత్తుగా యూటర్న్ తీసుకున్నారని మరికొందరు చెబుతుండగా, వేచిచూసి గట్టిగా ప్రశ్నించారని కొందరు భావిస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో జనసేన, వైసీపీ కలుస్తాయనే చర్చ సాగుతోంది. ఈ అంశాలపైనా ఆరా తీస్తున్నారట.
ముందు ముందు ఎలా ఉంటుంది
పవన్ తీవ్ర విమర్శల తర్వాత చంద్రబాబు ఎన్డీయేకు కటీఫ్ చెప్పారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏ పార్టీకి ఎంత లాభం చేకూరుతుందనే చర్చ సాగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కొందరు నేతలు తమ తమ ప్రాంతంలో ప్రయివేటుగా సర్వేలు చేయించుకుంటున్నారట.